చికోటి ప్రవీణ్ క్యాసినో కేసు.. మల్లికా షెరావత్కు కోటి, ఇషా రెబ్బాకు రూ.40 లక్షలు!
క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్ కుమార్కు కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు పెద్దపెద్ద తలకాయలు ఇందులో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్ కుమార్కు కేసులో పలు కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. బుధవారం ప్రవీణ్తో పాటు మాధవరెడ్డి తదితర ఏజెంట్లపై ఈడీ ఎనిమిది చోట్ల సోదాలు చేసింది. ఇందులో భాగంగా.. పలు కీలక ఆధారాలను గుర్తించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘనలపై ఈ దృష్టి పెట్టింది. హవాలా లావాదేవీలు ఎక్కడెక్కడ సాగుతున్నాయనే విషయంపై కన్నేసింది. క్యాసినో చాటున చికోటి ప్రవీణ్ పెద్ద దందానే నడిపిస్తున్నట్టుగా తెలిసింది. ఈడీ సోదాల్లో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్ ల్యాప్ ట్యాప్ దర్యాప్తులో అసలు విషయాలను బయటకు చెప్పే అవకాశం ఉంది. ప్రముఖల లిస్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
చికోటి ప్రవీణ్కు దాదాపు 200 మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. ఈ లిస్టులో ఎమ్మెల్యేల, ఇతర ప్రజాప్రతినిధులు, సినిమా స్టార్లు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నేపాల్కు వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు సైతం ఉన్నారట. చెన్నై బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్గా ఉన్నాడు ప్రవీణ్. ఇతడి కింద హవాలా పని చేసే వాళ్లు మరికొందరు ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా.. ఈ రాకెట్ నడుస్తోంది. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్, దుబాయ్లలో చికోటి ప్రవీణ్ క్యాసినో దందాలు ఉన్నట్టుగా సమాచారం.
క్యాసినోలో భాగంగా.. కస్టమర్ల నుంచి ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక ప్యాకేజీలు.. పెట్టాడు. ప్రతి జూదగాడు విమాన ఛార్జీలు, ఆహారం, హోటల్ బస, డ్రింక్స్, వినోదం కోసం రూ. 3 లక్షలకు పైగా చెల్లించాలి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కొన్ని సమయాల్లో ప్రత్యేక విమానాలను సైతం ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. ఈ దందాలో టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకూ ప్రముఖులు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీరందరితోనూ.. ప్రవీణ్కు పరిచయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ అయింది. పలువురు సినీ సెలబ్రిటీలతో క్యాసినోకు సంబంధించిన ప్రమోషన్ వీడియోలు చేయించాడు. సోషల్ మీడియాలో ఉన్నాయి. కొందరు సెలబ్రిటీలను నేపాల్కు కూడా తీసుకెళ్లాడు. సెలబ్రిటీలకు ప్రవీణ్ చేసిన చెల్లింపులు, వారి మధ్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది.
అయితే తాజాగా టాలీవుడ్, బాలీవుడ్ తారలకు ప్రవీణ్ ఇచ్చిన పారితోషికాల లిస్ట్ బయటకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది చూస్తే.. షాకింగ్ గా ఉంది. మల్లికా షెరావత్కు కోటి, ఇషా రెబ్బాకు రూ.40 లక్షలు, అమీషా పటేల్కు రూ.80 లక్షలు, డింపుల్ హయాతికి రూ.40 లక్షలు, ముమైత్ ఖాన్ రూ.15 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు, గణేశ్ ఆచార్యకు రూ.20 లక్షలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం అధికారికంగా బయటకు రావాల్సి ఉంది.
ఇప్పటికే.. విచారణకు హాజరుకావాల్సిందిగా ప్రవీణ్, మాధవరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై ప్రవీణ్ స్పందించాడు. సోమవారం విచారణకు హాజరవుతానని తెలిపారు. అధికారులకు వివరణ ఇస్తానని చెప్పాడు. ఎలాంటి మనీ ల్యాండరింగ్ వ్యవహారం లేదని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ కేసులో మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. మాధవరెడ్డి కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం. ఆ స్టిక్కర్ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఉంది. ఈ వ్యవహారంపై మాధవరెడ్డి స్పందించారు. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్కు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆ స్టిక్కర్ను తాము గతంలోనే పడేశామని చెప్పాడు.
ఈ స్టిక్కర్ వ్యవహారంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన స్టిక్కర్ తనదే చెప్పారు. కానీ ఆ స్టిక్కర్ మాత్రం మార్చి 2022 నాటిదని తెలిపారు. మూడు నెలల క్రితమే తీసేసి బయట పడేశామని పేర్కొన్నారు. ఎవరో పెట్టుకుంటే తనకేం సంబంధం లేదని.. మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.
టాపిక్