పరమహంస యోగానంద మహాసమాధి వేళ భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు
పరమహంస యోగానంద మహాసమాధిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టింది యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా. తెలుగు రాష్ట్రాల్లో ఆయన శిష్యులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు పరమహంస యోగానంద మహాసమాధిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్లోని యోగదా సత్సంగ ధ్యాన కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆయన శిష్యులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు జరిగాయి.
భారతదేశపు అతి గొప్ప సాధువుల్లో ఇద్దరి మహాసమాధి రోజులు ప్రతి సంవత్సరము మార్చి నెలలో వారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారు. చిరస్థాయిగా నిలిచి ఉండే మహాగ్రంథమైన హోలీ సైన్స్ను రచించిన స్వామి యుక్తేశ్వర్ గిరి 1936 మార్చి 9న ఒరిస్సాలోని పూరీలో తన శరీరత్యాగం చేయగా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయన శిష్యుడు పరమహంస యోగానంద 1952 మార్చి 7న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలిస్లో ఉన్న బిల్ట్ మోర్ హోటల్లో మహాసమాధి చెందారు.
ప్రాచీన శాస్త్రీయ ధ్యాన పద్ధతైన “క్రియాయోగం”.. యోగానంద బోధనలకు ప్రధాన ఇతివృత్తం. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది క్రియాయోగ దీక్ష తీసుకున్నారు. అనివార్యమైన జనన మరణ చక్రాల నుంచి విముక్తి కోసం క్రమం తప్పకుండా ఈ ప్రాచీన ప్రక్రియను సాధన చేస్తున్నారు. ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణశక్తిని అదుపులో ఉంచి, శక్తిని బాహ్యంగా, పంచేంద్రియాల వైపు కాకుండా.. లోపలకి, వెనుబాము, మెదడు వైపునకు మరలిస్తారు. భక్తిని, సరైన కార్యాచరణను, గురువు మార్గదర్శకతను జోడించినప్పుడు ఈ “క్రియాయోగ” ప్రక్రియ విఫలం కాదని యోగానంద అనేవారు.
యోగానంద ప్రపంచ ప్రఖ్యాత ”ఒక యోగి ఆత్మకథ” ముద్రించి 75 సంవత్సరాలైన సందర్భంగా ఈ ఏడాది దాని స్మారకోత్సవం నిర్వహిస్తున్నారు. “మిగిలినవన్నీ ఆలస్యం చెయ్యవచ్చు.. కానీ మీ దైవాన్వేషణను మాత్రం ఆలస్యం చెయ్యడానికి వీలులేదు” అన్న మాటలతో యోగానంద ప్రజలు సమయం వ్యర్థం చేయకుండా తమ జీవితాలనే తోటల నుంచి కలుపు మొక్కలను పెరికివేసి జీవిత సర్వోత్కృష్ట లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు.