Child Murder : రెండేళ్ల చిన్నారిని గోడకేసి కొట్టి… ముక్కు మూసి హత్య-mother killed two years child to continue extra marital affair ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Child Murder : రెండేళ్ల చిన్నారిని గోడకేసి కొట్టి… ముక్కు మూసి హత్య

Child Murder : రెండేళ్ల చిన్నారిని గోడకేసి కొట్టి… ముక్కు మూసి హత్య

HT Telugu Desk HT Telugu
Dec 20, 2022 09:06 AM IST

Child Murder వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో రెండేళ్ల చిన్నారిని దారుణంగా హతమార్చిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. ఫిట్స్ వచ్చాయంటూ ప్రభుత్వాస్పత్రికి చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయట పడింది.

వివాహేతర సంబందానికి అడ్డుగా ఉందని రెండేళ్ల చిన్నారి హత్య
వివాహేతర సంబందానికి అడ్డుగా ఉందని రెండేళ్ల చిన్నారి హత్య

Child Murder కోవిడ్‌ కారణంగా భర్త చనిపోయిన మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి రెండేళ్ల చిన్నారి అడ్డుగా ఉండటంతో బాలికను అడ్డు తొలగించుకోడానికి దారుణంగా ప్రవర్తించారు. వారి హింసను తట్టుకోలేక చిన్నారి ప్రాణాలు విడిచింది. అనారోగ్యంతో ఉందని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక ఒంటిపై గాయాలను గమనించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. నిందితులు తమ వ్యవహారం బయటపడకుండా ఉండటానికి నెపాన్ని అత్తమామలపై వేయడానికి సోషల్ మీడియాలో ముందే ప్రచారం చేయడం పోలీసుల్ని సైతం నిశ్చేష్టుల్ని చేసింది.

ముద్దు మాటలతో ఇంట్లో తిరుగుతున్న రెండేళ్ల చిన్నారిని కన్నతల్లి సాయంతో ఆమె ప్రియుడు పొట్టన పెట్టుకున్నాడు. చిన్నారి ఏడుస్తుండటం తమ ఏకాంతానికి అడ్డు కలిగిస్తున్నదనే కోపంతో దారుణంగా కొట్టి చంపేశారు. కన్నతల్లి ఎదుటే బిడ్డను హింసించి చంపుతున్నా, ఆమె అడ్డు చెప్పకపోవడం గమనార్హం. నిందితురాలి అత్త, మామలకు అనుమానం రావడం, వైద్యులు చిన్నారి ఒంటిపై గాయాలను గుర్తించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.

చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకన్నకు కనగల్‌ మండలంలోని లచ్చు గూడెంకు చెందిన రమ్యతో 2015లో పెళ్లైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు శివరామ్‌తో పాటు, రెండేళ్ల కుమార్తె ప్రియాన్షిక ఉన్నారు. వెంకన్న ఏడాది క్రితం కరోనాతో చనిపోయాడు. ఆ తర్వాత రమ్య కొంత కాలం అత్తమామలతో కలిసి ఉంది. ఆ తర్వాత ఆమెకు అదే గ్రామానికి చెందిన పెరిక వెంకన్న అలియాస్ వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

కొంతకాలానికి అత్తింటి నుంచి వేరు పడిన రమ్య అద్దె ఇంట్లో ఉంటోంది. 14వ తేదీ రాత్రి రమ్య ఇంటికి వెంకన్న వచ్చిన సమయంలో చిన్నారి ప్రియాన్షిక ఏడుస్తుండటంతో అతను అసహనానికి గురై బాలికను విచక్షణా రహితంగా కొట్టినట్టు డిఎస్పీ నరసింహారెడ్డి వివరించారు. చిన్నారిని గోడకేసి కొట్టి, ముక్కు నోరు మూసేయడంతో స్పృహ కోల్పోయినట్లు గుర్తించి నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డుగా ఉండటంతోనే నిందితులు బాలికను కర్కశంగా హతమార్చినట్లు తెలిపారు.

పిల్లలకు ఏదైనా హాని జరిగితే గ్రామస్తులతో పాటు తన అత్తమామలే కారణమని నిందితులు వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియా గ్రూపులలో పోస్ట్ చేశారు. పాపకు మూర్ఛ వచ్చిందని 14 రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్లిన నిందితులు వైద్యులు చనిపోయినట్లు నిర్దారించడంతో ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని వదిలి వెళ్లిపోయారు. చిన్నారి ఒంటిపై గాయాలను రమ్య అత్తమామలతో పాటు వైద్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆస్తి కోసమే పిల్లల అడ్డు తొలగించుకోడానికి తమ కోడలు చాలా కాలంగా ప్రయత్నిస్తోందని రమ్య అత్త, మామలు ఆరోపించారు. బాదితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించారు. నిందితులు రమ్య, వెంకన్నలను రిమాండ్‌కు తరలించారు.

IPL_Entry_Point