Minister Harish Rao: ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్.. త్వరలో ప్రయోగత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభం-minister harish rao visit hyderabad mnj cancer hospital ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Harish Rao: ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్.. త్వరలో ప్రయోగత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభం

Minister Harish Rao: ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్.. త్వరలో ప్రయోగత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Feb 04, 2022 02:57 PM IST

30 ఏళ్ళల్లో 50 శాతం క్యాన్సర్ కేసులు పెరిగాయని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 రకాల క్యాన్సల గుర్తించినట్టు తెలిపారు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హాని చేస్తాయని.. వాటిని తీసుకోవద్దని సూచించారు.

మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు (Twitter)

వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా లక్డీకాపూల్ లోని ప్రభుత్వ ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్, సిటీ స్కాన్, 100 పడకల సత్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. పీహెచ్ సీ స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు హరీశ్ రావు చెప్పారు. బీపీ, షుగర్ వ్యాధుల లాగే క్యాన్సర్ ని కూడా స్క్రీనింగ్ చేయాలని సర్కారు నిర్ణయించిందన్నారు. అందులోభాగంగానే.. సిబ్బందికి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు హరీశ్ రావు తెలిపారు.

'గ్రామ స్థాయిలో 40 ఏళ్ళు దాటినా అందరికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయాలనేది మా ప్రయత్నం. రాష్ట్రంలో 22 శాతం నోటి, 13 శాతం బ్రెస్ట్ , 12 శాతం గర్భాశయ క్యాన్సర్ లు వెలుగు చూస్తున్నాయి. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎంఎన్ జేలో అధునాతన సిటీ స్కాన్ 7.16 కోట్లతో ఏర్పాటు చేశాం. రోటరీ క్లబ్ కోటి రూపాయలతో అందించిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని ప్రారంభించాం. సర్వేకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ లను స్క్రీన్ చేసేందుకు ఈ బస్ ఉపయోగపడుతుంది. నినా రావు చారిటబుల్ ట్రస్ట్ తరపున 3 కోట్ల తో పేషెంట్స్ అటెండెన్స్ కోసం 300 పడకలతో ఏర్పాటు చేసిన భవనం నేటి నుంచి అందుబాటులోకి వస్తుంది.' అని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

డెంటల్ ఎక్సరే కోసం ఓపీజీ మెషిన్ ని ఇవాళ ప్రారంభించినట్టు హరీశ్ రావు పేర్కొన్నారు. ఉద్యోగుల కోసం 23 స్పెషల్ రూమ్స్ బ్లాక్ ని 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశామన్నారు. 300 పడకల ఆస్పత్రిని 65 కోట్ల తో అరబిందో ఫార్మా వారు నిర్మిస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి కొత్త బ్లాక్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. పక్కనే ఉన్న మరో 3 ఎకరాల స్థలాన్ని ఎంఎన్ జే కి త్వరలో కేటాయిస్తామని.. ప్రస్తుతం ఇక్కడ మూడు ఆపరేషన్ థియేటర్లు మాత్రమే ఉన్నాయన్నారు. 15 కోట్ల తో త్వరలో 8 మాడ్యులార్ థియేటర్ లను అందుబాటులోకి తీసుకువస్తామని హరీశ్ రావు చెప్పారు. ఇందులో ఒకటి రోబోటిక్ థియేటర్ అన్నారు.

మార్చి నెలాఖరుకు కొత్త ఆపరేషన్ థియేటర్ లు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్య శ్రీ కింద క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తోంది. నిమ్స్, ఎంఎన్ జే ఆస్పత్రుల్లోనూ క్యాన్సర్ రోగులకు చికిత్స ఉంది. జాయింట్ రి ప్లేస్మెంట్ కోసం వైద్యులు 3డి టెక్నాలజీ తో చేస్తున్నారు. క్యాన్సర్ ని ప్రాథమిక దశలో గుర్తించి ఆసుపత్రికి రావాల్సిన బాధ్యత ప్రజలదే. ఏడాదికి 15,000 వేల మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ చేయనున్నాం. త్వరలో ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లలో ప్రారంభమవుతుంది.

                                                            - హరీశ్ రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

అంతకు ముందు మంత్రి హరీశ్ రావు ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రి లో ప్రతీ వార్డును పరిశీలించారు. అక్కడి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

IPL_Entry_Point