KTR Tweets : ఎంతమంది బీజేపీ నేతలపై ఐటీ దాడులు చేశారు....కేటీఆర్ ప్రశ్న
రాజకీయ కక్ష సాధింపులకు ఈడీ, ఐటీలను వాడుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీర్ బీజేపీని నిలదీస్తూ ట్వీట్ చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో మంత్రి కేటీఆర్ బీజేపీపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. గత ఎనిమిదేళ్ల కాలంలో ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ , ఇన్కమ్ టాక్స్, సిబిఐ రైడ్స్ బీజేపీ నేతలు, వారు అనుయాయులపై జరిగాయని ప్రశ్నించారు. బీజేపీ నాయకులంతా సత్యహరిశ్చంద్రుడి వారసులేనా అని ప్రశ్నించారు.
దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్ధులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్లను బీజేపీ ఉసిగొల్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి కూడా ఈడీ నోటీసులు జారీ చేశారు. రాజకీంగా ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టడానికి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటుందనే ఉద్దేశంలో కేటీఆర్ తాజా ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడుగా టిఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తుండటంతో వారికి ఇలా వ్యంగంగా కౌంటర్ ఇచ్చారు.
జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్టాగ్తో కేటీఆర్ చేసిన ట్వీట్ను పలువురు రీ ట్వీట్ చేశారు. తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష పాటిస్తోందని కేటీఆర్ గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని కేటీఆర్ పలు సందర్భాల్లో ఆరోపించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా రాజకీయాలు చేస్తోందని పలు సందర్భాల్లో కేటీఆర్ ఆరోపించారు.
టాపిక్