Harish Rao on BJP : బీజేపీలో చేరితే రాజకీయంగా గొయ్యి తవ్వుకున్నట్లే : హరీశ్ రావు
Harish Rao on BJP : బీజేపీపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో మతతత్వ పార్టీకి చోటులేదన్న ఆయన... ఎవరైనా ఆ పార్టీలో చేరితే తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లు అవుతుందని హెచ్చరించారు.
Harish Rao on BJP : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి.. బీజేపీలో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో... మంత్రి హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు. ఎవరైనా ఉన్న పార్టీని వదులుకుని బీజేపీలో చేరితే తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుందని హెచ్చరించారు. జనవరి 18న ఖమ్మం వేదికగా జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సంబంధించి ఇల్లందులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్.. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఆరోపించిన ఆయన.. ఆ పార్టీకి ఖమ్మంలో చోటు లేదని నిరూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇల్లందు చరిత్రను ప్రపంచానికి చాటిన సింగరేణిని బొందపెడుతున్న బీజేపీకి ఈ గడ్డమీద స్థానం ఉంటుందా ? అని ప్రశ్నించిన హరీశ్... సింగరేణి బచావ్ - బీజేపీ హఠావ్ అని నినదించారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో స్థానం లేదని అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
"రైల్వేలను , ప్రభుత్వ రంగ సంస్థలను , దేశ సంపదను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోంది. ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. దేశంలో బీజేపీని కూకటి వేళ్లతో సహా పీకేస్తే తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు మనుగడ సాగించలేవు. 15 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. దేశంలో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్కటి కూడా భర్తీ చేయడం లేదు. మన నేత కేసిఆర్ గారు 91 వేల ఉద్యోగాలు నింపుతూ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా చూస్తున్నారు. ఉద్యోగాలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా ? ఉద్యోగాలు తీసేసే బీజేపీ కావాలా? ప్రజలే నిర్ణయించాలి" అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధిలో దేశంలోని 28 రాష్ట్రాల కంటే ముందు నిలబెట్టారన్నారు హరీశ్. తెలంగాణ ఆచరణను దేశమంతా అనుసరిస్తోందని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు కార్యక్రమాలను కాపీ కొట్టిన కేంద్రం... వేరే పేర్లతో దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు తెలంగాణ పథకాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తే పదికి పది పురస్కారాలు తెలంగాణ గ్రామాలే దక్కించుకున్నాయని... ఉత్తమ గ్రామం , ఉత్తమ మండలం , ఉత్తమ పంచాయతీ , ఉత్తమ మున్సిపాలిటీ పురస్కారాలన్నింటినీ తెలంగాణే గెలుచుకుందని తెలిపారు. అన్ని వర్గాలకు మేలు చేసే సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిలా మారిందని చెప్పారు.
ఈ సందర్భంలో... దేశ చారిత్రక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టమన్న హరీశ్.. సభ విజయవంతం అయితే అదే మనకు పెద్ద పండగ అని అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఢిల్లీ , పంజాబ్ , కేరళ ముఖ్యమంత్రుల తో పాటు సీపీఎం, సీపీఐ జాతీయ నాయకులు, రైతు సంఘం నేతలు హాజరవుతున్నారని చెప్పారు. కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలను కూడా కలుపుకొని సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.