Unidentified Disease in Karimnagar: అంతుచిక్కని రోగం.. ఓ కుటుంబం మొత్తం బలైపోయింది
4 members of a family dies with rare disease: అంతుచిక్కని వ్యాధి... ఫలితం ఓ కుటుంబం మొత్తం కుప్పకూలిపోయింది. నెలరోజుల్లోనే తల్లిదండ్రితో పాటు ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.
Unidentified Disease in Karimnagar: భార్య, భర్త... వారికి ఓ పాప, బాబు..! ఇంతవరకు హ్యాపీ.. కానీ ఓ అంతుచిక్కని రోగానికి వారంతా బలైపోయారు. మొదట పిల్లలకు రాగా... అదీ కాస్త తల్లి, తండ్రికి కూడా చేరింది. వారు కూడా అనంతలోకాలకు వెళ్లిపోయారు. కేవలం ఇదంతా 45 రోజుల్లోనే జరిగిపోయింది. ఈ తీరని విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.
ఇలా జరిగింది…
45 రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం..కరీంనగర్ జిల్లా గంగాధరలో సంచలనంగా మారింది. మెరుగైన వైద్యం కోసం లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేదు. ఫ్యామిలో ఉన్నవారంతా చనిపోయారు. స్థానికంగా ఈ విషయం పెద్ద కలకలమే రేపింది. వివరాలు చూస్తే... గంగాధరకు చెందిన శ్రీకాంత్కు చొప్పదండికి చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి కూతురు అమూల్య (6), కుమారుడు అద్వైత్ (2) జన్మించారు. మొదట కుమారుడికి వాంతులు మొదలయ్యాయి. దానితో పాాటు వీరేచనాల సమస్య వేధించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ బాధ నుంచి కోలుకోముందే... కుమార్తె అమూల్యం కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డిసెంబర్9న ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో ఆ తల్లిదండ్రుల విషాదంలో మునిగిపోయారు. సీన్ కట్ చేస్తే మమత కూడా అస్వస్థతకు గురైంది. ప్రమాదాన్ని గ్రహించిన భర్త శ్రీకాంత్ వెంటనే హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మమత కూడా ఆదివారం తుదిశ్వాస విడిచింది. కుటుంబం మొత్తం తన కళ్ల ముందే చనిపోవడంతో శ్రీకాంత్ కు పుట్టెడు దుఖమే దిక్కైంది. ఇదే క్రమంలో అతను కూడా అనారోగ్యానికి గురి కావటంతో శనివారం ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా ఆ కుటుంబమే లేకుండా అయిపోయింది.
ఏమై ఉండొచ్చు...?
జస్ట్ 45 రోజుల్లోనే 4 మరణాలు సంభవించటంతో అసలేం జరిగిందనేది అర్థం కావటం లేదు. వారికి వచ్చిన రోగమెంటో కూడా అంతుచిక్కటం లేదు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. మృతుల రక్త నమూనాలను పూణె ల్యాబ్కు పంపించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. నివేదికలు వస్తేగానీ వివరాలు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు ఈ అంతుచిక్కని వ్యాధిపై స్థానికల్లో భయం నెలకొంది. ఏం జరుగుతుందో అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.