Asaduddin Owaisi| మా దేశం.. మా ఇంటి సమస్య.. మధ్యలో మీకెందుకు.. పాక్ మంత్రికి అసదుద్దీన్ కౌంటర్
భారత్ లో కొద్ది రోజులుగా.. హిజాబ్ పై రగడ నడుస్తోంది. దీనిపై పాక్ విదేశంగ మంత్రి.. మహ్మద్ ఖురేషీ కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
భారత్ లో కొన్ని రోజుల నుంచి నడుస్తున్న హిజాబ్ రగడపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హిజాబ్ తమ సమస్య అని.. మధ్యలో మీరేందుకు వస్తున్నట్టు అని అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. ఇది మా దేశం.. మా ఇంటి సమస్యను మేమే పరిష్కరించుకుంటామన్నారు. మీకున్న సమస్యలను మీరు పరిష్కరించుకోండి.. బాలికల విద్యపై మీరు పాఠాలు చెబితే వినే పరిస్థితిలో మేం లేం.. అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
'హిజాబ్ ధరించిన కారణంగా మహిళలను విద్య నుంచి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మానవహక్కులను హరించడమే అవుతుంది. హిజాబ్ ధరించిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం అంటే అణచివేయడమే. ఇలా చేయడం ద్వారా ముస్లింలను గుప్పిట్లో పెట్టుకోవాలని భారత ప్రభుత్వం చూస్తోంది.' అంటూ పాక్ మంత్రి మహ్మద్ ఖురేజీ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు.
మలాలాను అటాక్ చేసింది పాకిస్తాన్ లోనేనని.. మహిళలకు హిజాబ్ అనేది.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఒవైసీ చెప్పారు. ఆ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని.., హిజాబ్ కోసం పోరాడే వారికి సంపూర్ణంగా మద్దతు ఉంటుందని.. అసదుద్దీన్ పేర్కొన్నారు. కర్ణాటక సర్కార్ హిజాబ్ కు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఇవ్వడంపై అసదుద్దీన్ మండిపడ్డారు. అది రాజ్యాంగ విరుద్ధమేనని వ్యాఖ్యానించారు. ముస్లిం మహిళలకు అలాంటి నిబంధన విధించడం ఏంటని ప్రశ్నించారు. ఎవరేం వేసుకుంటారు.., కుటుంబ సభ్యులు ఎలాంటి దుస్తులు ధరించాలి.., ఎలాంటి తిండి తినాలి అని మీరు చెప్పడం ఏంటని అడిగారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలనేది వారి ఇష్టం అని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని అసదుద్దీన్ గుర్తు చేశారు. ఎలాంటి ఆహారం తినాలి అనేది ఎవరి ఇష్టం వారిదని.. కోర్టు చెప్పిందన్నారు. రైట్ టు ఛాయిస్ అనేది ప్రాథమిక హక్కు అన్నారు.
కర్ణాటకలోని కళాశాలలో హిజాబ్ కు సంబంధించి.. నిరసనకారులకు ముస్కాన్ అనే అమ్మాయి బదులిచ్చిన విషయం తెలిసిందే. ఆ అమ్మాయితో మాట్లాడినట్టు.. అసదుద్దీన్ తెలిపారు. ఆమె మతం , ఎంపిక స్వేచ్ఛను వినియోగించుకుంటూ విద్య పట్ల ఆమె నిబద్ధతలో స్థిరంగా ఉండాలన్నారు. ఆమె చేసిన చర్య మనందరికీ ధైర్యాన్ని కలిగించిందన్నారు.