Dead body manhole: ప్రియురాలిని హత్య చేసి.. మ్యాన్ హోల్లో పడేసిన పూజారి
Dead body manhole: హైదరాబాద్ శంషాబాద్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో యువతిని హత్య చేసిన పూజారి, మృతదేహాన్ని మ్యాన్హోల్లో పడేశాడు. ఆ తర్వాత యువతి కనిపించడం లేదని ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో సాంకేతిక ఆధారాలతో ఫిర్యాదు చేసిన వ్యక్తే నిందితుడని గుర్తించారు.
Dead body manhole: హైదరాబాద్ శంషాబాద్ శివార్లలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో యువతిని హత్య చేసిన పూజారి శవాన్ని సరూర్నగర్ ఎమ్మార్వో ఆఫీసు వెనుక ఉన్న మ్యాన్ హోల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
ట్రెండింగ్ వార్తలు
హైదరాబాద్కు చెందిన అప్సర అనే యువతి అదృశ్యమైందంటూ అయ్యగారి సూర్య సాయికృష్ణ అనేవ్యక్తి రాజీవ్గాంధీ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3వ తేదీన అప్సరను భద్రాచలం వెళ్లడానికి శంషాబాద్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సమీపంలో వాహనం ఎక్కించానని 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
5వ తేదీన సాయికృష్ణ నుంచి మిస్సింగ్ కేసు ఫిర్యాదు వచ్చిందని శంషాబాద్ పోలీసులు చెబుతున్నారు.ఆర్టీఐ పరిసర ప్రాంతంలో అప్సరను డ్రాప్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొనడంతో జాతీయ రహదారిపై ఉన్న సిసికెమెరాలను పరిశీలించారు. అతను చెప్పిన వివరాలు క్షేత్ర స్థాయిలో ఉన్న ఆధారాలతో సరిపోక పోవడంతో పోలీసులు అనుమానించారు. మరోవైపు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అప్సరకు తాను మేనమామ అవుతానని తెలిపాడు. పోలీసుల విచారణలో మృతురాలితో అతనికి ఎలాంటి బంధుత్వం లేదని గుర్తించారు. దీంతో అతని పాత్రపై విచారణ చేపట్టారు.
రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారణలో సాయికృష్ణ చెప్పే వివరాలకు పొంతన లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 3వ తేదీన సాయికృష్ణ సుల్తాన్ పల్లిలో హత్య చేసినట్లు గుర్తించారు. నాలుగేళ్ల క్రితం అతను సుల్తాన్పల్లి గోశాలలో ఉన్న ఆలయంలో పని చేసేవాడు. అప్సరతో ఉన్న పరిచయం, వివాహేతర సంబంధం నేపథ్యంలో 3వ తేదీన సుల్తాన్ పల్లి తీసుకొచ్చాడు.ఆ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణపై అప్సర ఒత్తిడి చేయడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఈ క్రమంలో ఆమెను బండరాయితో తలపై కొట్టి చంపేశాడు.
ఆ తర్వాత సుల్తాన్పల్లి నుంచి శవాన్ని కారులో సరూర్ నగర్ ఎమ్మార్వో ఆఫీసు కు చేర్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని ఆలయంలోనే సాయికృష్ణ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అక్కడకు వచ్చే అప్సరతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న సాయికృష్ణ ఆమెతో పెళ్లికి నిరాకరించడంతో వివాదం తలెత్తింది. హత్య తర్వాత తన ఇంటికి సమీపంలో ఉన్న ఎమ్మార్వో ఆఫీసు మ్యాన్ హోల్లో పడేశాడు.
రెండ్రోజుల తర్వాత ఆర్జీఐ పోలీసులకు ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అతని చెప్పిన సమయంతో పాటు ఆ తర్వాత కూడా ఇద్దరి మొబైల్ ఫోన్ లొకేషన్స్ ఒకే చోట ఉండటంతో పోలీసులు అనుమానించారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీల్లో ఇద్దరు కలిసి ఒకే వాహనంలో ప్రయాణించినట్లు గుర్తించారు.
పోలీసులకు మాత్రం శంషాబాద్ సమీపంలో అప్సరను భద్రాచలం వెళ్లే వాహనం ఎక్కించానని ఫిర్యాదు చేశాడు. సాయికృష్ణ చెప్పిన సమయాల్లో అంబేడ్కర్ నగర్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఆసమయంలో అతని వాహనంలోనే అప్సర ఉందని గుర్తించారు. దీంతో గురువారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
పోలీసుల విచారణలో హత్య విషయాన్ని వెల్లడించాడు. నాలుగేళ్ల క్రితం సుల్తాన్ పల్లి గోశాలలో పనిచేయడంతో ఏకాంతం కోసం అప్సరను అక్కడకు తీసుకుని వెళ్లాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడం, ఆ తర్వాత హత్య చేసి సుల్తాన్పల్లి నుంచి సరూర్ నగర్ తీసుకెళ్లి శవాన్ని మ్యాన్ హోల్లో పడేశాడు. మ్యాన్హోల్లో పడేసిన అప్సర మృతదేహాన్ని వెలికితీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.