Team India Failure Reasons: టీ20 ప్రపంచకప్లో టీమిండియా పరాభవానికి ప్రధాన కారణాలేంటో తెలుసా?
Team India Failure Reasons: టీ20 ప్రపంచకప్ టీమిండియా.. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ టోర్నీ నిష్క్రమించి ఇంటిముఖం పట్టింది. మరి ఈ విధంగా రోహిత్ సేన పరాజయం పాలవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
Team India Failure Reasons: టీమిండియా చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని దాదాపు పదేళ్లు కావస్తుంది. చివరిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. దీని తర్వాత ఇంతవరకు ఆ ఆశ తీరలేదు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లోనైనా ఆ కోరిక తీరుతుందేమోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. అయితే టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్.. అనూహ్యంగా సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. పది వికెట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. 2019 వరల్డ్ కప్, 2021 టీ20 ప్రపంచకప్, 2022 టీ20 వరల్డ్ కప్ ఇలా ప్రతీసారి రిక్తహస్తాలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో 2022 టీ20 ప్రపంచకప్లో భారత వైఫల్యానికి కారణమేంటి? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది? లాంటి విషయాలను గురించి ఇప్పుడు చూద్దాం.
పవర్ ప్లేలో బ్యాటర్లు ప్రభావం చూపకపోవడం..
భారత టాపార్డర్ నిలకడలేమి టీమ్ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఆరంభం ప్రశ్నార్థకంగా మారింది. కేఎల్ రాహుల్ ఆడిన 6 మ్యాచ్ల్లో నాలుగింటిలో ఘోరంగా విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒకే ఒక్కసారి నామమాత్రమైన అర్ధశతకాన్ని చేశాడు. ఈ టోర్నీలో పవర్ ప్లే భారత ఆటగాళ్లు అత్యంత పేలవ ప్రదర్శన చేశారు.
పదునైన పేస్ బౌలింగ్ కొరత..
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడటంతో టీమిండియా టోర్నీ ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే బుమ్రా స్థాయిని అందుకునే పేసర్ కొరవడటం జట్టుపై తీవ్రంగా ప్రభావితం చూపింది. అతడి స్థానంలో ఎంతో మంది పేర్లు వినిపించాయి. గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంగా బౌలింగ్ చేయగలే ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్ల పేరును కొంతమంది సమర్థించారు. అయితే బుమ్రా స్థానంలో షమీని ఎంపిక చేయడంతో అతడు రిజర్వ్లోకి ప్రవేశించలేకపోయాడు.
సీనియర్ ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడటం..
ఈ టోర్నీలో భారత్ ఎక్కువగా వయస్సు ఎక్కువగా ఉన్న సీనియర్ ఆటగాళ్లపైనే ఆధారపడింది. కెప్టెన్ రోహిత్ శర్మ వయస్సు 35. సూర్యకుమార్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడనప్పటికీ.. అతడి వయస్సు కూడా 32. ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న దినేశ్ కార్తిక్ వయస్సు కూడా 37, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్ల వయస్సు 32కు పైనే ఉంది. ఇలా మూడు పదుల వయస్సు దాటిన వారిలో కోహ్లీ, సూర్యకుమార్ మినహా మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేదు.
మణికట్టు స్పిన్నర్లకు నో ఛాన్స్..
ఈ టీ20 ప్రపంచకప్లో భారత జట్టులో ఉన్న 15 మంది ఆటగాళ్లలో ఏకైక మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహలే. అయితే టీమిండియా ఆరు మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా అతడిని ఆడించలేదు. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్నే టోర్నమెంట్ పొడవునా సమర్థించింది. మణికట్టు స్పిన్నర్లు టీ20 క్రికెట్లో వికెట్ టేకింగ్ ఆప్షన్లు ఇప్పటికే చాలా సార్లు నిరూపితమైంది.
సంబంధిత కథనం