శని జయంతి ఎల్లుండి.. ఇలా చేస్తే శనీశ్వరుడి అనుగ్రహం
శని జయంతి ఈనెల 19న రానుంది. ఈ రోజు కొన్ని ప్రత్యేక పనులు చేయడం ద్వారా శని అనుగ్రహం లభిస్తుంది. శనీశ్వరుడు న్యాయ దేవత. అయితే వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిని పాపగ్రహంగా భావిస్తారు.
శని జయంతి ఈసారి మే 19న శుక్రవారం రానుంది. జ్యేష్ట అమావాస్య కృష్ణ పక్షం రోజున శనిజయంతి జరుపుకుంటారు. ఇదే రోజున వట సావిత్రి వ్రతం కూడా చేసుకుంటారు.
ట్రెండింగ్ వార్తలు
శని దేవుడి అనుగ్రహం పొందాలంటే శని జయంతి రోజున ఉపవాసం ఉంటూ శని దేవుడిని పూజించాలి. ఈసారి శని జయంతి రోజున శోభన్ యోగం ఏర్పడబోతోంది. మే 18న రాత్రి 07.37 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం వరకు 06.17 గంటల వరకు ఈ యోగం ఉంటుంది. ఇదే సమయంలో శని జయంతి రోజున చంద్రుడు గురు గ్రహంతో మేష రాశిలో కలవడం వల్ల గజ కేసరి యోగం ఏర్పడుతుంది. ఇక శని తన కుంభ రాశిలో శని యోగాన్ని ఏర్పరుస్తాడు.
శని జయంతి 2023 పూజా విధి
శని జయంతి రోజున శనీశ్వరుడికి పూజలు చేయడం శ్రేయస్కరం. ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించాలి. శని దేవుడి విగ్రహానికి తైలాభిషేకం చేయాలి. పూలతో అలంకరించాలి. నైవేద్యం సమర్పించాలి. నల్ల మినప్పప్పు, నల్ల నువ్వులు శని పాదాల వద్ద సమర్పించాలి. ఇనుప మేకులు కూడా సమర్పించాలి. నూనెతో దీపం వెలగించాలి. అనంతరం శని చాలీసా చదువుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది.
శని జయంతి రోజున దానాలు చేయడం వల్ల మీ ఈతిబాధలు తొలగుతాయి. కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే పేదలకు అన్నదానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. శని దేవుడి న్యాయ దేవత. అంటే ఒక వ్యక్తి చర్యలను బట్టి శిక్షిస్తాడు. అంటే మానవ కర్మల ఆధారంగానే అతడికి ఫలితాలు ఉంటాయి.
శని జయంతి రోజున సాయంత్రం పడమటి దిశలో దీపం వెలిగించాలి. ఓం శని శనైశ్చరాయ నమ: అంటూ జపం చేయాలి.
అలాగే శనీశ్వరుడి మంత్రి పఠించాలి
ఓం నీలాంజన సమాభాసం..
రవిపుత్రం యమాగ్రజం..
ఛాయామార్తాండ సంభూతం..
తం నమామి శనైశ్చరం..
ఓం శం శనైశ్చరాయ నమః
అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.