Odisha train accident: ఒడిశాలో రైలు ప్రమాద మృత దేహాలను తాత్కాలికంగా భద్రపర్చిన స్కూలు భవనం కూల్చివేత
Odisha train accident: సరిగ్గా వారం క్రితం, గత శుక్రవారం ఒడిశాలో బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో సుమారు 280 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్థానికంగా ఉన్న పాఠశాల భవనంలో తాత్కాలికంగా భద్రపర్చారు.
Odisha train accident: సరిగ్గా వారం క్రితం, గత శుక్రవారం ఒడిశాలో బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ సహా మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో సుమారు 280 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్థానికంగా ఉన్న ఉన్నత పాఠశాల భవనంలో తాత్కాలికంగా భద్రపర్చారు. ఆ తరువాత, ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తు తెలియని మృతదేహాలను జిల్లా హాస్పిటల్ మార్చురీలో భద్రపర్చారు.
ట్రెండింగ్ వార్తలు
విద్యార్థులు భయపడ్తున్నారు..
వేసవి సెలవుల కారణంగా ఖాళీగా ఉండడంతో బహనాగ ఉన్నత పాఠశాల భవనంలో రైలు ప్రమాదంలో మరణించిన వారి శవాలను భద్రపర్చారు. అయితే, వేసవి సెలవులు ముగిసి, సోమవారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. దాంతో, గతంలో కుప్పలు కుప్పలుగా మృతదేహాలను ఉంచిన ఆ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలోకి వెళ్లడానికి విద్యార్థులు భయపడ్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆ భవనంలోకి పంపించడానికి వెనుకాడుతున్నారు. ఉపాధ్యాయులు సైతం ఆ భవనంలో విధులు నిర్వర్తించడానికి వెనుకాడుతున్నారు. పాఠశాల భవనంలో నుంచి ఇప్పటికీ ఒక రకమైన దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. ఈ భవనంలోనే వందల శవాలను ఉంచారన్న విషయాన్ని మర్చిపోవడం చాలా కష్టమని, దానివల్ల తమలో భయం వేస్తుందని ఒక విద్యార్థి తెలిపాడు.
భవనం కూల్చివేత..
ఈ నేపథ్యంలో ఆ స్కూల్ భవనాన్ని కూల్చేయాలని నిర్ణయించారు. పాత భవనాన్ని కూల్చివేసి, ఆ ప్రదేశంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. కొత్త భవనం సిద్ధమైన తరువాత, ఆ భవనానికి శాంతి పూజలు చేయాలని, అన్ని మతాల ప్రార్థనలు నిర్వహించి, దాన్ని శాస్త్రోక్తంగా పవిత్రం చేయాలని స్థానిక నాయకులు, అధికారులు భావిస్తున్నారు. దాంతో, విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిపోతాయని భావిస్తున్నారు.