Nobel Peace Prize 2022: ‘మానవ హక్కు’లకు నోబెల్ శాంతి బహుమతి
Nobel Peace Prize 2022: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని శుక్రవారం నోబెల్ అకాడమీ ప్రకటించింది. బెలారస్ కు చెందిన ఒక హక్కుల కార్యకర్తకు, రష్యా, ఉక్రెయిన్ల లోని మానవ హక్కుల సంస్థలకు ఈ సంవత్సరం ఈ పురస్కారం లభించనుంది.
Nobel Peace Prize 2022: నోబెల్ పురస్కారాల్లో కీలకమైన నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం నోబెల్ కమిటీ ప్రకటించింది. బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బ్యాలాయాట్స్కి, రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమొరియల్’, ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ ఈ సంవత్సరం నోబెల్ శాంతి పురస్కారాన్ని సంయుక్తంగా పొందాయి.
Nobel Peace Prize 2022: హ్యూమన్ రైట్స్..
‘‘బెలారస్ హక్కుల కార్యకర్త, రష్యా, ఉక్రెయిన్ లలోని హ్యూమన్ రైట్స్ సంస్థలు తమ తమ దేశాల్లోని పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు గత కొన్నేళ్లుగా రాజ్యం చేసే తప్పులను ఎత్తి చూపుతూ, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు’’ అని 2022 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటిస్తూ నార్వే నోబెల్ కమిటీ పేర్కొంది. ‘‘ఆయా దేశాల్లోని యుద్ధ నేరాలను, మానవ హక్కుల ఉల్లంఘనను, అధికార దుర్వినియోగాన్ని ఎత్తి చూపుతూ సమాజంలో ప్రజాస్వామ్యం, శాంతి పరిఢవిల్లేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు’’ అని వివరించింది.
Nobel Peace Prize 2022: నోబెల్ పురస్కారాలు..
వైద్య రంగంలో నోబెల్ బహుమతిని ప్రకటించడం ద్వారా సోమవారం నుంచి నోబెల్ పురస్కారాల ప్రకటనలు ప్రారంభమయ్యాయి. మంగళవారం భౌతిక శాస్త్రంలో, బుధవారం రసాయన శాస్త్రంలో, గురువారం సాహిత్యంలో, శుక్రవారం శాంతి రంగంలో నోబెల్ అవార్డులను ప్రకటించారు. ఇక అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారం ప్రకటనతో ఈ సంవత్సరం నోబెల్ అవార్డు గ్రహీతలెవరో పూర్తిగా తేలుతుంది.