Youngest app developer : 12ఏళ్లకే 'యాప్ డెవలపర్'.. గిన్నిస్ బుక్లో చోటు!
Youngest app developer : అతను చదివేది 8వ తరగతి. అతని వయస్సు 12ఏళ్లు. కానీ అతని ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. 12ఏళ్లకే మూడు యాప్లు రూపొందించి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నాడు. అతనే హరియాణాకు చెందిన కార్తికేయ జాఖర్!
Youngest app developer : ఇప్పుడున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో పెద్దలు, యువతే కాదు.. పిల్లలు కూడా పోటీ పడుతున్నారు! ఇందుకు 12ఏళ్ల కార్తికేయ జాఖర్ ఓ ఉదాహరణ. 12ఏళ్ల వయస్సులోనే మూడు యాప్లను రూపొందించేశాడు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే అతి పిన్న యాప్ డెవలపర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించుకున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. హరియాణాలోని జాజర్ ప్రాంతంలో నివాసముంటున్న కార్తికేయ.. 8వ తరగతి చదువుకుంటున్నాడు. అతని తండ్రి ఓ రైతు. కాగా.. కొవిడ్ సంక్షోభంలో ఆన్లైన్ క్లాస్ల కోసం రూ. 10వేలు పెట్టి కార్తికేయకు ఓ స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చాడు అతని తండ్రి. చదువుకుంటూనే.. యూట్యూబ్లో కోడింగ్కి సంబంధించిన వీడియోలు చూడటం మొదలుపెట్టాడు కార్తికేయ. అక్కడ మొదలైన ప్రయాణం.. మూడు యాప్లను రూపొందించేంత వరకు ఆగలేదు.
"జీకే ఆన్లైన్, రామ్ కార్తిక్ లర్నింగ్ సెంటర్, శ్రీ రామ్ కార్తిక్ డిజిటల్ ఎడ్జ్యూకేషన్ పేర్లతో మూడు యాప్లను రూపొందించాను. ప్రస్తుతం 45వేలకుపైగా మంది విద్యార్థులకు ఈ యాప్లు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాయి," అని కార్తికేయ వెల్లడించాడు.
ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది.. సొంతంగా యాప్లు డెవలప్ చేసినట్టు కార్తికేయ వివరించాడు. దేశానికి సేవ చేయాలన్నది తన లక్ష్యం అని స్పష్టం చేశాడు.
Kartikeya Jakhar : యాప్ డెవలప్ చేయడంతో పాటు.. తన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శిస్తున్నాడు కార్తికేయ. ఇప్పటికే.. దిగ్గజ హార్వర్డ్ వర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలు రాసి.. స్కాలర్షిప్ గెలుచుకున్నాడు. ఆ వర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్నాడు.
కుమారుడి ప్రతిభను చూసి అతని తండ్రి సంబరపడిపోతున్నాడు. ప్రభుత్వం.. తన బిడ్డకు సాయం చేయాలని వేడుకుంటున్నాడు.
"నా కుమారుడు మరిన్ని యాప్లను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాను. కార్తికేయ చాలా తెలివైనవాడు. డిజిటల్ టెక్నాలజీ మార్గంలో ప్రయాణించి.. అతను దేశానికి సేవ చేయాలన్నది నా కోరిక," అని కార్తికేయ తండ్రి.. హిందుస్థాన్ టైమ్స్కు చెప్పాడు.
మరోవైపు.. బాలుడి ప్రతిభపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రశంసల వర్షం కురిపించారు. మరింత ఎదగాలని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ఇప్పుడు జాజర్ ప్రాంతంలో కార్తికేయ హాట్ టాపిక్గా మారాడు. అంతేకాకుండా.. అతని చేత మాట్లాడించి.. ఇతర విద్యార్థుల్లో స్ఫూర్తినింపేందుకు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు. అతనిని చూసి విద్యార్థులు కూడా తన ప్రతిభతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని వారందరు ఆశిస్తున్నారు.
సంబంధిత కథనం