Didi meets Modi | మోదీతో దీదీ భేటీ; లక్ష కోట్ల బకాయిల కోసం అభ్యర్థన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ శుక్రవారం సమావేశమయ్యారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కాంలో పశ్చిమబెంగాల్ మంత్రిని ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. వీరిద్దరి ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Didi meets Modi | నాలుగు రోజుల పర్యటనకు గానూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఢిల్లీ వచ్చారు. ప్రధాని అధికారిక నివాసంలో శుక్రవారం ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బెంగాల్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సత్వరమే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆమె ప్రధానిని కోరారు. రాష్ట్ర అవసరాల కోసం తక్షణమే వాటిని విడుదల చేయాలని కోరారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులను విడుదల చేయడంలో కేంద్రం వివక్ష చూపుతోందని మమత బెనర్జీ ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేశారు.
Didi meets Modi | కేంద్రం నిధులు
కేంద్రం నుంచి వివిధ పథకాల కింద పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను సత్వరమే విడుదల చేయాలని ప్రధాని మోదీని మమత బెనర్జీ కోరారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మొత్తం రూ. 1,00,968.44 కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రధానికి అందజేసిన వినతి పత్రంలో వివరించారు. నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా మర్యాదపూర్వకంగా మమత కలవనున్నారు. ఢిల్లీ రాగానే ఆమె మొదట పార్టీ ఎంపీలతో సమావేశమై, పార్లమెంటు సమావేశాల తీరుపై ఆరా తీశారు.
Didi meets Modi | అవినీతి ఆరోపణలు
మమత బెనర్జీ మంత్రివర్గంలోని సీనియర్ సహచరుడు పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ప్రధాని మోదీతో మమత భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ స్కామ్లో సెటిల్మెంట్ కోసమే మమత ప్రధానిని కలిశారని బీజేపీ ఆరోపించింది. అయితే, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసమే ఆమె ప్రధానితో సమావేశమయ్యారని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మమత ఆగస్ట్ 7న నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా పలువురు విపక్ష నేతలను కూడా ఆమె కలవనున్నారని సమాచారం.