Paytm results | పెరిగిన పేటీఎం నష్టాలు..
భారత్లోని ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ స్టార్ట్ అప్ సంస్థ పేటీఎం కు నష్టాలు కొనసాగుతున్నాయి. జూన్తో ముగిసే త్రైమాసికంలో రూ. 645 కోట్ల నష్టాన్ని పేటీఎం చవి చూసింది. 2022-23 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలను పేటీఎం పేరెంట్ సంస్థ One97 Communications శుక్రవారం విడుదల చేసింది.
జూన్తో ముగిసే త్రైమాసికంలో రూ. 645 కోట్ల నష్టాన్ని పేటీఎం చవి చూసింది. గత సంవత్సరం ఇదే కాలానికి పేటీఎం చవిచూసిన నష్టాల మొత్తం రూ. 381 కోట్లు మాత్రమే.
Paytm results | ఆదాయం పెరిగింది..
పేటీఎంకు నష్టాలు వచ్చినప్పటికీ.. ఆదాయంలో గణనీయ పెరుగుదల నమోదవడం విశేషం. ఆదాయం 17.81 వందల కోట్లని పేటీఎం వెల్లడించింది. ఇది 88 శాతం పెరుగుదల. అలాగే, ఈ సంవత్సరం మార్చ్తో ముగిసిన త్రైమాసికంలో Paytm నష్టాలు రూ. 762.5 కోట్లు కాగా, తాజా క్వార్టర్లో ఈ నష్టం రూ. 645 కోట్లకు తగ్గింది. అంటే నష్టంలో 15.3% తగ్గుదల నమోదైంది. ఆదాయం పెరుగుతుండడం, నష్టాలు తగ్గుతుండడం శుభసూచకమని, సెప్టెంబర్ 2023 నాటికి లాభాల్లోకి వెళ్తామని Paytm ధీమా వ్యక్తం చేస్తోంది.
Paytm results | సబ్స్క్రిప్షన్ ఆదాయం
సబ్స్క్రిప్షన్ ఆదాయం పెరిగిందని, పేటీఎం ప్లాట్ ఫామ్ ద్వారా నెలవారీ యుటిలిటీ సర్వీసుల పేమెంట్లను చెల్లించే వారి సంఖ్య పెరిగిందని వివరించింది. అలాగే, Paytm ద్వారా తమ భాగస్వామ్యులు ఇస్తున్న రుణాల సంఖ్య, ఈ కామర్స్ లావాదేవీలు కూడా పెరగడం శుభసూచకమని తెలిపింది. ఆదాయంలో నిలకడైన పెరుగుదల నమోదు అవుతుండడం తాము సరైన వ్యూహంతోనే వెళ్తున్నామన్న విషయాన్ని నిర్ధారిస్తోందని వివరించింది.