India on Russia Ukraine war : ‘శాంతికి సాయం చేస్తాము’- భారత్
India on Russia Ukraine war : రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ స్పందించింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేస్తామని పేర్కొంది.
India on Russia Ukraine war : రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తాజా పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ మంచిది కాదని స్పష్టం చేసింది. ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పునరుద్ఘాటించింది.
ఉక్రెయిన్పై సోమవారం మిసైళ్లతో విరుచుకుపడింది రష్యా. రాజధాని కీవ్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు.. రష్యా దాడుల్లో దద్దరిల్లాయి. 84కుపైగా మిసైళ్లను రష్యా ప్రయోగించినట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఆయా ఘటనల్లో 10కిపైగా మంది మరణించినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలపై ఇండియా ఈ విధంగా స్పందించింది.
"ఉద్రిక్త వాతావరణం పెరగడం ఎవరికీ మంచిది కాదని మేము మళ్లీ చెబుతున్నాము. పౌరుల మృతిపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఉద్రిక్త పరిస్థితులను తక్షణమే తగ్గించి, దౌత్యపరమైన చర్చలకు ఇరు దేశాలు ముందడుగు వేయాలి. ఇందుకోసం సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది," అని విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
యుద్ధం నేపథ్యంలో గతవారమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో సంభాషించారు. శాంతికి సాయం చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు.. పుతిన్తో 'యుద్ధానికి ఇది సమయం కాదు,' అని వ్యాఖ్యానించారు మోదీ.
'ఉక్రెయిన్కు వెళ్లకండి..'
Russia Ukraine war latest news : ఉక్రెయిన్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో పౌరులకు సూచనలు జారీ చేసింది భారత ప్రభుత్వం. అవసరమైతే తప్ప.. ఉక్రెయిన్లో పర్యటించకూడదని స్పష్టం చేసింది. భద్రతాపరమైన ఆదేశాలను పాటించాలని తేల్చిచెప్పింది.
"ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఉక్రెయిన్కు, ఉక్రెయిన్ లోపల ప్రయాణాలు మానుకోవాలని భారత పౌరులకు సూచిస్తున్నాము. స్థానిక యంత్రాంగం, ఉక్రెయిన్ ప్రభుత్వం ఇస్తున్న సూచనలు కచ్చితంగా పాటించాలి," అని కీవ్లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఉక్రెయిన్లో ఎవరైనా భారతీయులు ఉంటే.. తమ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది.
సంబంధిత కథనం