Bihar Politics | నితీశ్ వ్యూహం బీజేపీకి ముందే తెలుసు!
Bihar Politics | బిహార్ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారాయి. బిహార్ హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వెళ్లాయి. నితీశ్ మిత్ర పక్షం బీజేపీకి బై చెప్పి.. పాత ఫ్రెండ్ ఆర్జేడీతో చేతులు కలపడం దేశంలో తాజా సంచలనంగా మారింది. ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ రియాక్షన్ ఏంటి?
Bihar Politics |నితీశ్ వ్యూహాన్ని బీజేపీ ముందు పసిగట్టిందని, కావాలనే ఈ విషయంలో మౌనంగా ఉందని, ఎన్డీయేలో ఉండాలని నితీశ్పై ఒత్తిడి తీసుకురాకపోవడం వెనుక బీజేపీ భవిష్యత్తు వ్యూహం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
Bihar Politics | ముందే తెలుసా?
జేడీయూ నేత నితీశ్ కుమార్ బీజేపీకి, తద్వారా ఎన్డీయేకు దూరం కావాలని నిర్ణయించుకున్న విషయం బీజేపీకి ముందే తెలుసా? జేడీయూ బీజేపీకి దూరం కావడం బీజేపీకే లాభకరమని బీజేపీ భావించిందా? అందుకే ఈ విషయంలో పెద్దగా రియాక్ట్ కావడం లేదా? అంటే అవుననే సమాధానం విశ్లేషకుల నుంచి వస్తోంది. కొన్నాళ్లుగా బీజేపీకి నితీశ్ దూరమవుతున్నారు. ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే తన చర్యల ద్వారా వెల్లడి చేస్తున్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము అభినందన కార్యక్రమానికి, తాజాగా నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలిసి సమస్యలను పరిష్కరించుకుందామన్న స్థానిక బీజేపీ నేతల ప్రతిపాదనను కూడా ఆయన తోసిపుచ్చారని సమాచారం.
Bihar Politics | కావాలనే మౌనం..
ఈ పరిస్థితుల్లో నితీశ్ ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న బీజేపీ అగ్ర నేతలు ఈ పరిణామాలను మౌనంగా పరిశీలించడమే మేలనే అభిప్రాయానికి వచ్చారు. ``ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉంది. జేడీయూకు బీజేపీ కన్నా తక్కువ సీట్లు వచ్చినా.. సంకీర్ణ ధర్మాన్ని అనుసరించి, నితీశ్కు సీఎం పదవిని అప్పగించాం. అయినా, నితీశ్ మోసం చేశారు. నితీశ్ ఇలా పలుమార్లు కూటములను మార్చిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అదీకాక, దాదాపు వరుసగా రెండు దశాబ్దాల పాటు సీఎం పదవిలో ఉన్న నితీశ్ కమార్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత చాలా ఉంది. ఇప్పుడు నితీశ్తో కలిసి ఉండి, ప్రభుత్వ వ్యతిరేకతను పంచుకోవడం కన్నా.. విడిపోయి సొంతంగా బలం నిరూపించుకోవడం మేలు. రానున్న ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, ఆర్జేడీల మధ్యనే పోటీ ఉంటుంది`` అన్న అభిప్రాయంతో బీజేపీ అధిష్టానం ఉందని స్థానిక బీజేపీ నేతలు వివరిస్తున్నారు.
Bihar Politics | జాతీయ రాజకీయాలపై దృష్టి..
మరోవైపు, నితీశ్ వ్యూహాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ.. ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలన్న ఆలోచనలో ఉన్న విషయాన్ని గుర్తించింది. ``ప్రస్తుతం విపక్షాలు ఏకతాటిపై లేవు. వాటిని ఏకతాటిపైకి తీసుకురావాలన్న కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దేశవ్యాప్తంగా సుపరిపాలన సాగించగల నేతగా నితీశ్కు దేశవ్యాప్తంగా కొంతవరకు పేరుంది. ఇది ఇతర విపక్ష నేతలతో పోలిస్తే.. ఆయనకు అడ్వాంటేజ్. అందువల్ల, 2024 లోక్సభ ఎన్నికల నాటికి.. విపక్షాల కూటమికి నేతృత్వం వహించాలన్న ఆలోచనతో, కోరికతో నితీశ్ ఉన్నారు. ఇందుకు ప్రస్తుత వ్యూహాన్ని తొలి అడుగుగా వేశారు`` అని నితీశ్ తీరును పరిశీలిస్తున్న విశ్లేషకులు వివరిస్తున్నారు.