Zee Telugu New Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్ మా వారు మాస్టారు.. ఎప్పటి నుంచంటే?
Zee Telugu New Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్ మా వారు మాస్టారు రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆ ఛానెల్ ఆదివారం (జూన్ 4) రిలీజ్ చేసింది.
Zee Telugu New Serial: తెలుగులోని టాప్ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగులో సరికొత్త సీరియల్ ప్రారంభం కాబోతోంది. ఈ సీరియల్ పేరు మావారు మాస్టారు. తెలుగులో వచ్చే టాప్ 10 సీరియల్స్ లో జీ తెలుగుకు సంబంధించిన సీరియల్స్ కూడా ఉంటాయి. దీంతో ఆ ఛానెల్ నుంచి వచ్చే కొత్త సీరియల్స్ పై సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
ఇక ఇప్పుడు రాబోయే మావారు మాస్టారు సీరియల్ ప్రోమో కూడా ఆసక్తికరంగానే ఉంది. ఈ ప్రోమోను ఆదివారం (జూన్ 4) ట్విటర్ ద్వారా ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. ఈ సీరియల్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది. గణపతి (పృథ్వీ రాజ్), అతని తల్లి పార్వతి (మీనా కుమారి), శ్రీవిద్య (సంగీతా కల్యాణ్ కుమార్) చుట్టూ తిరుగుతుంది.
ఓ స్కూల్లో తాను టీచర్ అని అమ్మకు అబద్ధం చెబుతాడు గణపతి. ఇటు శ్రీవిద్యకు కూడా అలాగే కనిపిస్తాడు. కానీ ఆ స్కూల్లో అతడు చేసేది ప్యూన్ ఉద్యోగం అని వీళ్లకు తెలియదు. తన పెద్ద కొడుకు పది మందికీ పాఠాలు చెప్పే దేవుడు అంటూ గణపతిని ఎంతో గారాబంగా చూసుకుంటుంది పార్వతి. అది చూసి చిన్న కొడుకు కోపగించుకున్నా.. పార్వతి మాత్రం వినదు.
అమ్మ ఆశయం కోసం ఆడిన అబద్ధం అగాథంగా మారితే అంటూ ఈ కొత్త సీరియల్ ప్రోమో ముగుస్తుంది. ఇంతకీ తాను టీచర్ ను అని గణపతి ఎందుకు అబద్ధం చెబుతాడు? అది అబద్ధం అని తెలిసిన తర్వాత ఆ తల్లి, అతనే తన భర్త అని ఊహించుకుంటున్న ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ మావారు మాస్టారు సీరియల్ ఇవ్వనుంది.
చదువుపై ఎంతో మక్కువ ఉన్నా.. తల్లి మరణం వల్ల శ్రీవిద్యకు అది సాధ్యం కాదు. అయితే తన చదువు పూర్తి చేయడం కోసం ఓ టీచర్ నే పెళ్లాడాలని కలలు కంటుంది. ఎంతో హుందాగా ఉన్న గణపతిని చూసి ప్రేమలో పడుతుంది. అతన్నే పెళ్లి చేసుకుంటుంది. అటు తల్లి, ఇటు భార్యకు అబద్ధం చెప్పిన గణపతి తన ఉద్యోగ రహస్యాన్ని ఎన్నాళ్లు రహస్యంగా ఉంచుతాడన్నది ఇక్కడ సస్పెన్స్.
సంబంధిత కథనం