Urvashi Defamation Case: ఊర్వశిని అఖిల్ వేధించాడా? హీరోయిన్ పరువు నష్టం కేసు
Urvashi Defamation Case: బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా తన లీగల్ టీమ్ ద్వారా ఓ జర్నలిస్టుపై పరువు నష్టం కేసు వేసింది. అతడి ఫేక్ పోస్టు కారణంగా తనతో పాటు తన కుటుంబం అసౌకర్యానికి గురైందని స్పష్టం చేసింది.
Urvashi Defamation Case: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాలో ప్రత్యేక గీతంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఎక్కువగా యాడ్ షూట్స్, ఐటెమ్ సాంగ్స్తో అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తాజాగా ఊర్వశీ.. ఓ ప్రముఖ జర్నలిస్టుపై పరువు నష్టం దావా కేసు వేసింది. అతడి ఫేక్ పోస్ట్ ద్వారా తనతో తన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడిందని, అసౌకర్యానికి గురైనట్లు తెలిపింది. దీంతో సదరు జర్నలిస్టుపై పరువునష్టం కేసు నమోదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ రివ్యూవర్, జర్నలిస్టు ఉమైర్ సంధు.. ఇటీవల ఊర్వశీ రౌటేలా గురించి వివాదాస్పద పోస్టు పెట్టారు. అఖిల్ అక్కినేని హీరోగా చేసిన ఏజెంట్ సినిమాలో ఉర్వశీ ఓ ప్రత్యేక గీతంలో చేసిందని, ఆ పాట షూట్ సమయంలో అఖిల్ నుంచి ఆమె వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా అఖిల్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వల్ల ఆమె అసౌకర్యానికి గురైనట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
ఉమైర్ సంధు చేసిన ఈ వ్యాఖ్యలపై ఊర్వశి స్పందించిది. అతడి ఫేక్ పోస్టు కారణంగా తన ఫ్యామిలీ అసౌకర్యానికి గురైనట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. "నా లీగల్ టీమ్ ద్వారా పరువునష్టం కేసు చట్టపరమైన నోటీసు అందజేశాను. మీ ఫేక్/హాస్యాస్పదమైన ట్వీట్లపై అసంతృప్తి చెందాను. మీరు సరైన జర్నలిస్టులు కారు. అలాగే మీరు నా అధికార ప్రతినిధి కారు. అవును.. మీరు ఇమ్మెచ్యూర్ జర్నలిస్టు. మీ అపరిపక్వ ట్వీట్ల కారణంగా నాతో పాటు నా కుటుంబం కూడా అసౌకర్యానికి గురైంది." అని ఊర్వశి తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం ఊర్వశీ పెట్టి పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. బాధపడొద్దంటూ తమ స్పందనలను తెలయిజేస్తున్నారు. ఉర్వశీ మేడమ్ మీకు తోడుగా మేము ఉన్నాం అంటూ ఓ యూజర్ స్పందించగా.. హేటర్స్ ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందిస్తున్నారని, ఆందోళన పడొద్దంటూ ఇంకొకరు స్పష్టం చేశారు.
ఊర్వశీ పోస్టుపై ఉమైర్ సంధు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. తన ఇన్ స్టా పోస్టులో ఈ ముద్దుగుమ్మ అతడి ఇన్ డీసెంట్ పర్సన్ అని, ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందిస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది.