The Kerala Story Collections: బాక్సాఫీస్ దగ్గర ది కేరళ స్టోరీ సంచలనం.. రోజురోజుకూ పెరుగుతున్న కలెక్షన్లు
The Kerala Story Collections: బాక్సాఫీస్ దగ్గర ది కేరళ స్టోరీ సంచలనం సృష్టిస్తోంది. రోజురోజుకూ కలెక్షన్లను పెంచుకుంటూ పోతోంది. మూడు రోజులు ముగిసే సరికి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో మూడోస్థానంలో నిలిచింది.
The Kerala Story Collections: ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ది కేరళ స్టోరీ గురించే చర్చ. గతేడాది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఎంతలా వివాదానికి కారణమైందో.. ఇప్పుడీ కేరళ స్టోరీ కూడా అంతకంటే ఎక్కువ వివాదాస్పదమవుతోంది. అయితే ఆ వివాదమే మూవీపై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు అంతంతమాత్రంగా ఉన్న కలెక్షన్లు.. రెండు, మూడో రోజుల్లో భారీగా పెరిగాయి.
తొలి మూడు రోజుల్లో కలిపి ది కేరళ స్టోరీ ఏకంగా రూ.33 కోట్లు వసూలు చేయడం విశేషం. తొలి రోజు కేవలం రూ.6.75 కోట్లుగా ఉన్న కలెక్షన్లు.. రెండో రోజు రూ.10.5 కోట్లకు, మూడో రోజైన ఆదివారం (మే 7) రూ.16 కోట్లకు చేరాయి. ఈ ఏడాది రిలీజైన బాలీవుడ్ సినిమాల్లో తొలి వీకెండ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ది కేరళ స్టోరీ మూడోస్థానంలో నిలిచింది.
పఠాన్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాల తర్వాత ది కేరళ స్టోరీ నిలవడం విశేషం. రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు ఈ మూవీ కలెక్షన్లు 50 శాతం వరకూ పెరిగాయి. ముఖ్యంగా గుజరాత్, సౌరాష్ట్రలలో ఈ సినిమాను ఎక్కువగా చూస్తున్నారు. అక్కడ ఆదివారం ఒక్క రోజే రూ.2 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. గతేడాది ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలాగే ఇప్పుడు ది కేరళ స్టోరీ కూడా మెల్లగా పుంజుకుంటోంది.
అయితే తమిళనాడులో మాత్రం ఈ సినిమాపై నిషేధం విధించారు. కేరళలోని థియేటర్లలో సినిమా కొనసాగుతోంది. సినిమాపై మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుండటంతో ది కేరళ స్టోరీకి పబ్లిసిటీ పెరిగిపోతోంది. అసలు అంతలా వివాదాస్పదం ఏమవుతుందో చూడాలన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో కలుగుతున్నట్లు కలెక్షన్లను చూస్తే తెలుస్తోంది.
మరోవైపు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్.. ది కేరళ స్టోరీ మూడు రోజుల్లో రూ.35.25 కోట్లు రాబట్టినట్లు ట్వీట్ చేశాడు. రెండు, మూడు రోజుల్లో కలెక్షన్లు భారీగా పెరిగినట్లు తెలిపాడు. కేరళలో అమాయక హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి, తర్వాత వాళ్లను ఐసిస్ లో ఉగ్రవాదులుగా ఎలా మారుస్తున్నారో ఈ సినిమాలో చూపించారు. అయితే ఏకంగా 32 వేల మందిని ఇలా చేసినట్లు సినిమాలో చూపించడమే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించారన్న ఆరోపణలు మేకర్స్ పై ఉన్నాయి.
సంబంధిత కథనం