Dhawan in TV Serial: బుల్లితెరపై గబ్బర్ ఎంట్రీ.. టీవీ సీరియల్లో టీమిండియా సీనియర్ క్రికెటర్
Dhawan in TV Serial: టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ హిందీ టీవీ సిరియల్ కుండలి భాగ్య అనే షోలో నటించనున్నాడు. ఇందులో పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడు.
Dhawan in TV Serial: టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. ఫామ్ లేమితో గతేడాది వరకు జట్టులోకి వస్తూ పోతున్న మన గబ్బర్.. డిసెంబరులో జరిగిన బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ తర్వాత అతడిని సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. అప్పటి వరకు రోహిత్ లేని సమయంలో కెప్టెన్గా వ్యవహరించిన అతడు.. ఇప్పుడు సెలక్టర్లు పిలుపు కోసం ఆత్రుతగా చూస్తున్నాడు. మరోవైపు ధావన్ స్థానాన్ని యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్ భర్తీ చేశారు. దీంతో ఐపీఎల్పైనే ఫోకస్ పెట్టాడు మన గబ్బర్. ఇదిలా ఉంటే తాజాగా శిఖర్ ధావన్ కొత్త అవతారమెత్తాడు. బుల్లితెరపై అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.
శిఖర్ ధావన్ ఓ హిందీ సీరియల్లో నటిస్తున్నాడు. ప్రముఖ టీవీ ఛానల్ జీలో ప్రసారమయ్యే హిందీ సీరియల్ 'కుండలి భాగ్య'లో పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఈ క్రికెటర్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.
ఈ వీడియోను గమనిస్తే సింగం బ్యాక్గ్రౌండ్ స్కోరుతో ధావన్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. తన మాస్ పర్ఫార్మాన్సెతో సెట్లో సందడి చేశాడు. రౌడీలను అదుపులోకి తీసుకుంటున్నట్లు మాస్ పోలీసుగా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. పోలీస్ గెటప్లో ధావన్ అదిరిపోయాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం టీమిండియాకు ధావన్ దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంటాడు. డ్యాన్స్ వీడియోలు, వైరల్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటాడు మన గబ్బర్. ఇప్పుడు ఏకంగా సీరియల్లోనే నటిస్తూ ఫ్యాన్స్ను అలరించాడు. అయితే ఈ సీరియల్ శిఖర్ ధావన్ అతిథి పాత్ర లేక ఫుల్ లెంగ్త్ రోలా అనేది తెలియాల్సి ఉంది.
జట్టులో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఐపీఎల్పైనే పెట్టాడు. పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ధావన్.. ఈ సీజన్లో ఆ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించనున్నాడు. గతేడాది పంజాబ్ సారథిగా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ స్థానంలో గబ్బర్ను కెప్టెన్గా నియమించింది యాజమాన్యం. మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది.