Chiranjeevi Indian Film Personality of The Year: ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా చిరంజీవి
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డ్ మెగాస్టార్ చిరంజీవిని వరించింది. ఈ అవార్డ్ కోసం చిరంజీవిని ఎంపికచేసినట్లు ఆదివారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
Chiranjeevi Indian Film Personality of The Year: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన అవార్డ్ లభించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డ్ వరించింది. ఈ పురస్కారానికి చిరంజీవిని ఎంపికచేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం ప్రకటించారు. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో భాగంగా ఈ అవార్డ్ను చిరంజీవికి ప్రకటించారు.
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 150కిపైగా సినిమాల్లో అద్భుతమైన డ్యాన్స్, అసమాన అభినయంతో కోట్లాది మంది హృదయాల్ని చిరంజీవి గెలుచుకున్నారని, ఆయనకు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. అనురాగ్ ట్వీట్కు చిరంజీవి స్పందించారు. అభిమానులు చూపించే నిస్వార్థమైన ప్రేమ నటుడిగా తనను ఈ స్థాయికి చేర్చిందని, ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
గతంలో ఈ అవార్డును ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం, రజనీకాంత్, హేమమాలిని, అమితాబ్బచ్చన్, సలీమ్ఖాన్ తదితరులు గెలుచుకున్నారు. 2013 నుంచి ఈ అవార్డులను అందజేస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన చిరంజీవికి టాలీవుడ్ తో పాటు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
అరుదైన పురస్కారాన్ని అందుకొన్న చిరంజీవిని సోదరుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ అభినందించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో శిఖర సమానుడైన అన్నయ్య చిరంజీవిగారికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారం వరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. ఆయన కీర్తి కిరీటంలో మరో వజ్రం ఇదని చెప్పారు. నాలుగు దశాబ్దాలపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం తనతో సహ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు.