11నుంచి గడపగడపకు వైసీపీ కార్యక్రమం….
ఏపీలో విపక్షాలు దూకుడుతో అధికార వైసీపీ కూడా “గడపగడపకు వైసీపీ” ప్రచార కార్యక్రమానికిు సిద్ధమైంది. ఇప్పటికే ప్రారంభించాల్సిన గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని ఈ నెల 11 నుంచి చేపట్టనున్నారు. ప్రచార సామాగ్రి సిద్ధం కాకపోవడంతో ఆలశ్యమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎట్టకేలకు బుధవారం నుంచి వైఎస్సార్సీపీ గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
ఓవైపు చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు, పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రలతో దూసుకుపోతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. గడపగడపకు వైఎస్సార్సీపీ పేరుతో ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ తర్వాత నాయకులంతా నియోజక వర్గాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.
ఎన్నికలకు రెండేళ్ల ముందే పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను వైసీపీని ఓడించాలని టీడీపీ, జనసేన భావిస్తుంటే, మళ్లీ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ భావిస్తోంది. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 95శాతం పూర్తి చేశామని ఆ పార్టీ చెబుతోంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్దిదారుల ఖాతాలకు లక్షా 38వేల 894కోట్ల రుపాయల నగదు బదిలీ చేశామని, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. బుధవారం నుంచి మొదలయ్యే కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఇంటింటికి పార్టీ కార్యక్రమాలను పరిచయం చేయాలని నిర్ణయించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షాలు ఎన్నికల పొత్తులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ విజయాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 1.38లక్షల కోట్లను మూడేళ్లలో ప్రజల ఖాతాలకు నేరుగా బదిలీ చేశామని, రెండేళ్లలో మరో లక్ష కోట్లను పంచడానికి సిద్దమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాల పైనే వైసీపీ గంపెడాశలు పెట్టుకుంది. ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలలో మెజార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు క్షేత్ర స్థాయి పర్యటనలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన కూడా చేపట్టాలని సీఎం ఆదేశించారు.
ఒక్కో నియోజక వర్గంలో 80 సచివాలయాలను ప్రాంతీయ కన్వీనర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు సందర్శించాల్సి ఉంటుంది. బుధవారం నుంచి మొదలయ్యే కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి దాదాపు 9నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత నిర్వహించే సర్వే ఫలితాలను బట్టి ఎమ్మెల్యేల భవితవ్యం ఉంటుుందని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో నేతలంతా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
సంబంధిత కథనం
టాపిక్