Ysrcp MP SaiReddy :విశాఖ ప్రతిష్ఠను దెబ్బదీసే కుట్రలు ఫలించవన్న సాయిరెడ్డి….
Ysrcp MP SaiReddy ‘సేవ్ ఉత్తరాంధ్ర’ పేరుతో విశాఖ ప్రతిష్ఠను దెబ్బదీసే కుట్రలు ఫలించవని, హేపెనింగ్ సిటీ వైజాగ్ వేదికగా చంద్రబాబు బృందం ఆగడాలు చెల్లవని, ‘సేవ్ ఉత్తరాంధ్ర’ పేరుతో వైజాగ్ బ్రాండ్ వాల్యూని తగ్గించే కుట్రలు చేస్తున్నారని ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు.
Ysrcp MP SaiReddy తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో ‘కలల రాజధాని’ అమరావతి ‘నగర నిర్మాణం’ తేలిక కాదని తెలిసి మరీ నాటకాలు ఆడారని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. నాలుగొందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ నిర్మాత తానేనని ఇప్పటికీ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారని ఎద్దేవా చేశారు.
ట్రెండింగ్ వార్తలు
చంద్రబాబు హైదరాబాద్ తన పాలనలోనే మహానగరం అయిందనే కల్లిబొల్లి కబుర్లతో 2014లో విభజిత ఆంధ్రకు మొదటి సీఎం అయ్యారని సాయిరెడ్డి అన్నారు. రాజధాని పేరిట గుంటూరు, విజయవాడ మధ్య ‘న్యూ సిటీ’ కట్టడానికి చంద్రబాబు వేసిన పునాది ఆ దిశగా సాగలేదన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం చావు దెబ్బతిన్నాక కూడా అమరావతి కబుర్లతోనే కాలక్షేపం చేశారని గుర్తు చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్నారు. ఉత్తరాంధ్రకు గుండె వంటి విశాఖపట్నాన్ని రాష్ట్రానికి పాలనా రాజధాని చేయాలని సంకల్పించారన్నారు. ఆర్థిక పునాదులు పటిష్ఠంగా ఉన్న వైజాగ్ వైఎస్సార్సీపీ పాలనలో శరవేగంతో ప్రగతి పథంలో పరుగులు తీస్తోందని అన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతతో వ్యవహరించాల్సిన తెలుగుదేశం వికృత చేష్టలతో ఉద్యమాల పేరిట విధ్వంసకాండకు తెగబడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు అండ్ కంపెనీ అరాచక ఆందోళనలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంటే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చూడడానికి ఇష్టపడని టీడీపీ, నానా యాగీ చేస్తోందని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల విశాఖపట్నం బ్రాండ్ వాల్యూ ఊహించని రీతిలో పెరుగుతోందని స్పష్టం చేశారు.
చంద్రబాబు వర్గీయులు ఎ.పి రాజధాని ‘అమరావతే’ అని భీష్మించుకుని కూర్చోవడంతో తమకు ఉత్తరాంధ్రలో నిలువ నీడ దక్కదనే భయంతో ‘సేవ్ ఉత్తరాంధ్ర’ అంటూ దుర్మార్గమైన నాటకానికి స్క్రిప్టు రూపొందించారని సాయిరెడ్డి మండ్డిపడ్డారు. వారి ఉద్యమం అబద్ధాలు, అర్థసత్యాల ప్రచారోద్యమం జనాదరణ లేక నీరుగారిపోతోందని చెప్పారు.తె
ఉత్తరాంధ్రను కాపాడతామనే పేరుతో విశాఖనగరానికి కీడు చేస్తున్నామనే వాస్తవం 72 ఏళ్ల నేత కళ్లకు కానరావడం లేదు. తన హయాంలో రాజధాని పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చేసిన నష్టం ఆయన మరిచిపోయారు. ఐటీ, ఫార్మా వంటి రంగాలు వేగంగా విస్తరించే అవకాశాలున్న హైదరాబాద్ ను అభివృద్ధి జరుగుతున్న నగరం అనే అర్ధంలో ‘హేపెనింగ్ సిటీ’ అనేవారని గుర్తు చేశారు. అదేవిధంగా నేడు విశాఖ కూడా ప్రగతిశీల నగరంగా పరుగులు పెడుతూ మరో హేపెనింగ్ సిటీ అవుతోందని తెలిపారు. విశాఖ అభివృద్ధికి గండికొట్టడానికి ఉత్తరాంధ్ర తెలుగుదేశం నేతలను వారి నాయకుడు నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.