YSRCP: వైసీపీ ఖాతాలోకే 4 రాజ్యసభ స్థానాలు.. ఏకగ్రీవంగా ఎన్నిక
ఏపీలోని 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ కోటాలోని నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. ఆ పార్టీ అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శాసన సభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ ఎన్నికలకు నలుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
దేశానికి ఆదర్శంగా సీఎం జగన్…
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ ఆర్. కృష్ణయ్య రాజ్యాధికారం లో బీసీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. సీఎం జగన్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. పేద కులాల సమస్యలు పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించారని అన్నారు. రాజకీయ కారణాలతోనే తనపై కేసు పెట్టారని.. బాధితుల పక్షాన పోరాటం చేయటం తన నైజం అని స్పష్టం చేశారు.
రుణపడి ఉంటాను..
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు అభివృద్ధికి కృషి చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం 30 మంది ఎంపీలు పాటు పడతాం. రాష్ట్రానికి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన కుటుంబానికి రుణ పడి ఉంటాను - విజయసాయిరెడ్డి, ఎంపీ
బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ అన్నారు. సీఎం అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మూడేళ్ళలో లక్షా 46 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టారన్న ఆయన.. అప్పు చేసి పేదలకు సంక్షేమం చేయకూడదని ప్రతిపక్షాలు చెప్పగలరా? అని ప్రశ్నించారు.
సీఎంకు కృతజ్ఞతలు - నిరంజన్ రెడ్డి
రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు నిరంజన్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధికి తన తరపున చేయగలిగింది చేస్తానని అన్నారు.
టాపిక్