Steel Plant Dilemma: స్టీల్ప్లాంట్ ఇష్యూలో పరువు పోయింది ఎవరికి? మైలేజీ ఎవరికి
Steel Plant Dilemma: విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో జరుగుతున్న రాజకీయంలో పరువు పోయింది ఎవరికి, పై చేయి సాధించింది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.స్టీల్ ప్లాంట్ నిర్వహణ భాగస్వామ్యంపై బిఆర్ఎస్ ఆసక్తి చూపించడం వెనుక రాజకీయ కారణాలే ప్రధానంగా కనిపిస్తున్నా, వైసీపీకి అంచనా కుదరలేదంటున్నారు.
Steel Plant Dilemma: విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో రాజకీయంగా ఎవరు పై చేయి సాధించారనేది ఏపీలో హాట్ టాపిక్గా మారింది. స్టీల్ ప్లాంట్ రాజకీయంలో బిఆర్ఎస్కు కావాల్సినంత మైలేజ్ దక్కడానికి వైసీపీ సహకరించిందనే అనుమానాలు కూడా లేకపోలేదు. అదికాస్త వికటించే సరికి మంత్రులు ఎదురు దాడి మొదలు పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో టీడీపీ వేలు పెట్టకపోగా, జనసేన మాత్రం ఎటు మాట్లాడితే ఏమవుతుందోనని చివరి వరకు ఎదురు చూసి తీరిగ్గా స్పందించింది.
విశాఖ ఉక్కు వ్యవహారంలో మొదట వర్కింగ్ క్యాపిటల్ పార్టనర్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియలో తెలంగాణ తరపున సింగరేణి పాల్గొంటుంది అనే వార్తలు గత సోమవారం వచ్చాయి. దీనిని తెలంగాణ బీజేపీ నాయకులు తప్పు పట్టారు. సొంత రాష్ట్రంలో బయ్యారం సంగతి ఏమైందని బండి సంజయ్, లక్ష్మణ్ వంటి నాయకులు ప్రశ్నించారు.
ఈ హడావుడి జరుగుతున్న సమయంలో తెలంగాణ నుంచి అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు అని మంత్రి అమర్నాథ్ తాపీగా సమాధానం చెప్పారు.
ఆంధ్రా వైఖరితో సంబంధం లేదన్న కేటీఆర్….
ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరితో మాకు సంబంధం లేదు, తెలంగాణకు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే ముఖ్యం. ఏపీ ప్రభుత్వ స్పందనతో మాకు సంబంధం లేదు. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలన్నది కేసీఆర్ విధానపరమైన నిర్ణయమని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తే రిజర్వేషన్లు మాయం అవుతాయని, లక్షలాది మంది దళిత గిరిజన, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. పాలసీ పరంగా ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్ద పీట వేయాలన్నదే తమ ప్రభుత్వ నిర్ణయమని మంత్రి కేటీఆర్ చెప్పారు.
గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒడిశాలో గనులను దక్కించుకున్నట్టే తాము స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటామన్నారు. బైలా జిల్లా గనుల్ని విశాఖ స్టీల్, బయ్యారంకు కేటాయిస్తే వాటిని కాపాడొచ్చన్నారు. క్యాప్టిమ్ మైనింగ్ అదానీ చేతుల్లో కట్టబెట్టిందని, అదానీకి దేశ సంపద దోచి పెడుతుంటే చూస్తూ ఉండాలా అని నిలదీశారు. ప్రభుత్వ సంస్థలు ఉండగా అదానీకి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
అదే సమయంలో సింగరేణి బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్ళింది. అప్పుడు కూడా ఆంధ్రా నుంచి పెద్దగా స్పందన రాలేదు. ప్రభుత్వ రంగం నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు, ప్రస్తుతం జరుగుతున్న ప్లాంట్ నిర్వహణలో భాగస్వాములు ఎంపిక, వనరుల సమీకరణ వ్యవహారాలతో సంబంధం లేని చర్చలు తెర పైకి వచ్చాయి.
సింగరేణికి సామర్థ్యం ఉందా….
సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వ వాటాలు కూడా ఉన్నాయి. అలాంటి సంస్థ స్టీల్ ప్లాంట్తో ఒప్పందాలకు కేంద్రం ఒప్పుకుంటుందా అనే సందేహాలు కూడా తలెత్తాయి. సింగరేణికి స్టీల్ ప్లాంట్ కు అవసరమైన 5వేల కోట్ల నిధులను వెచ్చించే సామర్ధ్యం ఉందా లేదా అనేది కూడా పెద్దగా చర్చ జరగలేదు. కోకింగ్ కోల్ ఇస్తామని ప్రతిపాదన సింగరేణి చేసిందని వారితో భేటీ అయిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ప్రకటించాయి.
ఈ సమయంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు తాము వ్యతిరేకం కాబట్టి, బిడ్డింగ్ కు మేము వ్యతిరేకం అని మంత్రి అమర్నాథ్ అన్నారు. బిడ్డింగ్, EOI మధ్య గందరగోళంతో అలా మాట్లాడి ఉండొచ్చని సరి పెట్టుకోవచ్చు. అప్పటికీ ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికలు పూర్తయ్యే వరకు స్టీల్ ప్లాంట్ జోలికి బీజేపీ వెళ్లదు అనే భావన ఏపీ ప్రభుత్వంలో ఉన్నట్టు అనధికారిక సంభాషణల్లో వినిపించింది.
ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ వ్యవహారం మీద బాగా ఆలస్యంగా కారుమురి, సీదిరి వంటి మంత్రులు రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నాలు చేశారు. ఏపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చే క్రమంలో తెలంగాణ నుంచి హరీష్ రావు కూడా రియాక్ట్ అయ్యారు. అందులో తన సహజమైన వైఖరి ప్రదర్శించారు.
తొలుత మాట్లాడిన కేటీఆర్ విధానపరమైన అంశాల జోలికి మాత్రమే స్పందించారు తప్ప ఆంధ్రప్రదేశ్ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయలేదు. రెండు వైపులా టాప్ లెవెల్ లో ఉన్న నాయకులు ఎవరు ఈ ఇష్యూ మీద స్పందించలేదు. మొదట మాట్లాడిన కేటీఆర్ కు కౌంటర్ ఇవ్వాలని కూడా వైసీపీ భావించినట్టు కనిపించలేదు.
ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బిఆర్ఎస్కు ఏకపక్షంగా మైలేజీ వస్తోందని గమనించేసరికి కంగారు పడ్డారు. డామేజ్ కంట్రోల్ కోసం మంత్రుల్ని రంగంలోకి దింపింది. నిజానికి పరిశ్రమల శాఖలో మేకపాటి ఉన్నపుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున బిడ్డింగ్ వేస్ ప్రతిపాదన నడిచింది అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఈ వివాదంలో జరుగుతున్న దానిని యధాతధంగా ప్రజలకు వివరించే ప్రయత్నం మొదట్లో చేయక పోవడం BRS అడ్వాంటేజ్ తీసుకుంది. ఆ తర్వాత వైసీపీ నష్ట నివారణ కోసం నానా పాట్లు పడాల్సి వచ్చిందని చెబుతున్నారు.
మరోవైపు బిఆర్ఎస్ ప్రతిపాదనల్ని సిపిఐ ఎప్పట్లాగే సమర్థించింది. జనసేన కూడా అన్ని ఆలోచించి తీరిగ్గా స్పందించింది. ఇక కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కూడా ఉదయం ఓ మాట, సాయంత్రం ఓ మాట చెప్పారు. ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని ప్రకటించిన మంత్రి సాయంత్రానికి అది క్యాబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు. దీంతో ప్లాంట్ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్లైంది.
సంబంధిత కథనం