Nara Lokesh Yuvagalam : నేటి నుంచి నారా లోకేష్ యువగళం…
Nara Lokesh Yuvagalam నందమూరి తారకరత్న మరణంతో బ్రేకులు పడిన యువగళం పాదయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. శనివారం బెంగుళూరులో చికిత్స పొందుతున్న తారకరత్న ఆకస్మికంగా మృతి చెందడంతో పాదయాత్రకు విరామం ప్రకటించారు. శనివారం మహాశివరాత్రి రోజు శ్రీకాళహస్తిలో పర్యటించడానికి పోలీసులు అనుమతించకపోవడంతో లోకేష్ యాత్రకు బ్రేకులు పడ్డాయి. అదే రోజు తారకరత్న మరణించడంతో ఆయన యాత్రకు విరామం ప్రకటించి హైదరాబాద్ చేరుకున్నారు.
Nara Lokesh Yuvagalam టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలో శనివారం పాదయాత్ర ఆకస్మాత్తుగా నిలిచిపోయింది. శుక్రవారం నుంచి లోకేష్ యాత్రకు పోలీసులు అటంకాలు సృష్టించారని టీడీపీ నేతలు ఆరోపించారు. మహా శివరాత్రి సందర్భంగా శనివారం శ్రీకాళహస్తి నియోజక వర్గంలో యాత్రకు అనుమతించకపోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.
శనివారం వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులపై ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు, నాయకులు, కార్యకర్తలతో లోకేష్ సమావేశాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం నుంచి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమించడం, సాయంత్రానికి కన్నుమూయడంతో యాత్రకు విరామం ప్రకటించారు.
జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన నారా లోకేష్ ఇప్పటి వరకు 22రోజులు పూర్తైంది. శనివారం శ్రీకాళహస్తి ఆర్టివో ఆఫీస్ ఎదుట విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. తారకరత్న అంత్యక్రియలు ముగిసిన తర్వాత లోకేష్ తిరిగి చిత్తూరు బయల్దేరారు.
షేక్ పేట్ మహా ప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల్లో తారకరత్నకు కడపటి వీడ్కోలు పలికారు. తారకరత్న అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చిన లోకేష్...అంత్యక్రియల అనంతరం మళ్ళీ హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి వెళ్ళిపోయారు. మంగళవారం శ్రీకాళహస్తి నుంచి తిరిగి యాత్రను ప్రారంభిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు సోమవారం గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడిని లోకేష్ తీవ్రంగా ఖండించారు. టిడిపిపై జగన్ రెడ్డి చేయిస్తున్న ఒక్కో దాడి వైసీపీకి సమాధి కట్టే ఒక్కో ఇటుక లెక్క అని హెచ్చరించారు. గన్నవరంలో టిడిపి ఆఫీసుపై వైసీపీ గూండాలు దాడి చేసి, నేతలని కొట్టి, వాహనాలను తగల బెడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూడటం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ అని లోకేష్ విమర్శించారు. పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయిన గన్నవరం నటోరియస్ క్రిమినల్కు పోగాలం దాపురించిందన్నారు. ఆడిన ప్రతీ తప్పుడు మాటకి, చేసిన ప్రతీ దుర్మార్గ పనికి పశ్చాత్తాప పడే రోజు దగ్గర పడింది. టిడిపి నేతలు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గన్నవరంలో అరాచకుడి దురాగతాలకు బుద్ధి చెబుదామన్నారు.
మరోవైపు పాదయాత్రలో భాగంగా లోకేష్ ఇప్పటి వరకు 296.6కి.మీ దూరం నడిచారు. యువగళం పాదయాత్ర 23వ రోజు ఆర్టీవో ఆఫీస్ విడిది కేంద్రం నుంచి మొదలు కానుంది.
నేటి పాదయాత్ర సాగనుంది ఇలా….
8.00 - శ్రీకాళహస్తి ఆర్టివో ఆఫీస్ ఎదుట విడిది కేంద్రంలో ముస్లింలతో ముఖాముఖి.
9.00 – పాదయాత్ర ప్రారంభం.
9.20 - మిట్టకండ్రిగలో స్థానికులతో మాటామంతీ.
11.00 - తొండంనాడులో స్థానికులతో మాటామంతీ.
11.15 - తొండమానుపురం దిగువ వీధిలో 300 కి.మీ పూర్తి అయిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ.
11.20 - తొండమానుపురం దిగువ వీధిలో మహిళలతో ముఖాముఖి.
12.10 - సుబ్బానాయుడు కండ్రికలో స్థానికులతో మాటామంతీ.
1.30 - వెంకటాపురంలో భోజన విరామం
సాయంత్రం
2.30 - బండారుపల్లిలో వన్యకుల క్షత్రియులతో సమావేశం.
4.00 – బండారుపల్లిలో స్థానికులతో మాటామంతీ.
5.30 - కోబాక విడిది కేంద్రంలో బస.
టాపిక్