EX Minister Vatti Vasanta Kumar: వట్టి వసంత్కుమార్ కన్నుమూత
మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
Vatti Vasanta Kumar passed away:ఏపీకి చెందిన మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వట్టి వసంత కుమార్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
వట్టి వసంతకుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని పూళ్ల గ్రామం. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన వసంత కుమార్... 2004, 2009 ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్రెడ్డి కేబినెట్లలో మంత్రిగా కూడా పని చేశారు. గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బలమైన వాణిని వినిపించారు. నాడు రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చలో... కీలక ప్రసంగం చేశారు. ఇక 2014 ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నారు.
వట్టి వసంత కుమార్ మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వసంత కుమార్ మరణం అత్యంత బాధాకరమన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి “నిజాయితి గల నాయకుడు. వ్యక్తిగతంగా మంచి మిత్రుడు,సోదరసమానులు. ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తు వుండేవాడు,వసంత్ గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తు భగవంతుడు వారి పవిత్ర ఆత్మకు శాంతిని కలుగజేయాలని ప్రార్థిస్తున్నాను” అంటూ రఘువీరారెడ్డి ట్వీట్ చేశారు. వసంత కుమార్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంతాపం ప్రకటించింది.