Bear Attack : శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు దాడి, ఒకరి మృతి, ఎనిమిది మందికి గాయాలు
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడి మామిడి, మామిడి తోటల్లో పనిచేస్తున్న కార్మికులపై దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పంటపొలాల్లోకి చొరబడిన ఎలుగుబంటి శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడగా ఒకరు మృతి చెందారు. జీడి మామిడితోటలో షెడ్ నిర్మాణం జరుపుతుండగా ఒక్కసారిగా దాడి చేసిన ఎలుగుబంటి కార్మికులపై విరుచుకుపడింది. కిడిసింగి-వజ్రపుకొత్తూరు మధ్య ఉన్న పొలాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలుగుదాడిలో గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స తర్వాత శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఎలుగుదాడిలో ఆదివారం పెద్దకొండ గ్రామానికి చెందిన వృద్ధుడు మరణించాడు. ఈ ఘటనపై స్థానికులు అటవీ శాఖకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో మరోమారు దాడి చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కిడిసింగి గ్రామానికి చెందిన స్థానికులు జీడి తోటలో షెడ్ నిర్మాణానికి రైతుకు సహకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆహారాన్ని వెదుక్కుంటూ తోటల్లోకి వచ్చి ఉంటుందని అటవీ సిబ్బంది చెబుతున్నారు.
జీడితోటలపై ఎలుగుబంట్లు దాడులు చేసిన పంటల్ని నాశనం చేసే ఘటనలు వజ్రపుకొత్తూరులో సాధారణమైపోవడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆదివారం పొలానికి వెళ్లిన గోవిందపై ఎలుగు దాడి చేసి చంపేయడంతో సాయంత్రం శవాన్ని గుర్తించారు. మరోవైపు ఎలుగుదాడి ఇద్దరు సైనికులు కూడా గాయపడ్డారు. సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఇద్దరు జవాన్లు రైతుకు షెడ్ నిర్మాణంలో సహకరిస్తుండగా వారిపై దాడి చేసింది. ఎనిమిది మంది గ్రామస్తులపై తీవ్రంగా దాడి చేయడంతో వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఎలుగుదాడిలో గాయపడిన వారిని మంత్రి అప్పలరాజు పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మరోవైపు రైతుల్ని బెంబేలెత్తిస్తున్న భారీ ఎలుగును పట్టుకునేందుకు అటవీ శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
టాపిక్