Police Case On SI : ఎస్సైపై హత్యాయత్నం కేసు నమోదు…
Police Case On SI ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలించుకునేందుకు హత్యాయత్నం చేసిన ఎస్సై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళ కూడా పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.
Police Case On SI నెల్లూరు జిల్లాలో ఓ పోలీస్ అధికారి దారి తప్పాడు. పనిచేసే చోట మహిళా కానిస్టేబుల్తో ప్రేమాయణం నడిపాడు. తల్లిదండ్రులు ఒప్పుకోకున్నా పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరాక ఆమెను వదిలించుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆమె అంగీకరించక పోవడంతో హత్యాయత్నం చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
ప్రేమన్నాడు, వెంటపడ్డాడు, అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. చివరకు ఆమెను వదిలించుకోడానికి అడ్డదారులు తొక్కాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న మహిళా కానిస్టేబుల్ను కట్నం రాలేదని వదిలించుకోడానికి ప్రయత్నించిన ఎస్సైపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిపై హత్యాయత్నం చేయడంతో అతనిపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలో మహిళా కానిస్టేబుల్పై ఎస్సై హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. బాధిత మహిళ కాపాడాలని డయల్ 100కు కాల్ చేయడంతో దారుణం వెలుగు చూసింది. సంతపేట పోలీస్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ను రెండేళ్ల క్రితం అదే పోలీస్ స్టేషన్లో పనిచేసే మహబూబ్ సుభానీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. బాధిత మహిళతో వివాహాన్ని ఎస్సై కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారికి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్న ఎస్సై పొదలకూరు రోడ్డులో కాపురం పెట్టారు.
ఎస్సై - కానిస్టేబుల్ కాపురం మొదట్లో సజావుగానే సాగినా ఆ తర్వాత ఎస్సై కుటుంబ సభ్యుల ఒత్తిడితో భార్యను వేధించడం ప్రారంభించాడు. భార్యను వదిలేసి వస్తే మరో వివాహం చేస్తామని ఎస్సై తల్లి, కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. దీంతో భార్యను వదిలించుకోడానికి కొద్ది నెలలుగా మహబూబ్ సుభానీ ప్రయత్నిస్తున్నాడు. సెప్టెంబర్ 9న తల్లితో కలిసి భార్యపై దాడి చేసి ఇంట్లో నిర్బంధించాడు. దీంతో బాధితురాలు డయల్ 100కు ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు డిపార్ట్మెంట్ ఉద్యోగులు కావడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేశారు.
ఘటనా జరిగిన కొన్నాళ్లకు భార్యపై దాడి చేసి ఉద్యోగానికి సెలవు పెట్టి సుభానీ వెళ్లిపోయాడు. బాధితురాలు దిశా పోలీసుల్ని ఆశ్రయించడంతో ఎస్సైపై అదనపు కట్నం వేధింపులు, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. ఎస్సై వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో మహబూబ్ సుభానీని వెంటనే అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశించారు.