Telugu News  /  Andhra Pradesh  /  Apsrtc Key Orders On Compassionate Appointments Full Details Here
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు,
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు, (apsrtc)

APSRTC: కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్… విధివిధానాలు ఖరారు

13 July 2022, 6:57 ISTHT Telugu Desk
13 July 2022, 6:57 IST

compassionate appointments in rtc: కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీఎస్ఆర్టీసీ. ఇందుకు సంబంధించి మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విధివిధానాలను వెల్లడించింది.

Compassionate Appointments in APSRTC: ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కలిగించేలా ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, జిల్లా కలెక్టర్ల పూల్‌ కింద కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు

మొత్తం 896 మంది…

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముందు సర్వీసులో ఉండగా.. 896 మంది ఉద్యోగులు మరణించారు. అయితే వీరి నియామకాలపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇంతలోనే ఆర్టీసీ.. సర్కార్ లో విలీనం కావటంతో మళ్లీ ఈ నియామకాలు తెరపైకి వచ్చాయి. ఇందుకు అనుగుణంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న 896 కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని సీఎం జగన్ ఇటీవల ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు.

భర్తీ ఇలా….

పెండింగ్‌లో ఉన్న 896 మంది కారుణ్య నియామకాల జాబితాను ఆర్టీసీ ఎండీ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపనున్నారు. వీరిలో అర్హులను గుర్తించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కలెక్టర్లు నియమిస్తారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఆర్టీసీ ఎండీకి పంపించనున్నారు.ఇలా మిగిలిన వారి జాబితాలోని అర్హతలను బట్టి ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లుగా నియమించే అకాశం ఉంది. అప్పటికి ఇంకా మిగిలి ఉంటే ఆ జాబితాను తిరిగి సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపనున్నారు. ఆర్టీసీ ఎండీ నుంచి వచ్చిన జాబితాలో ఉన్నవారికి కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలలో భర్తీ చేయనున్నారు.

ఇక కారుణ్య నియామకాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. చాలా ఏళ్లగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

టాపిక్