AP CID : సోషల్ మీడియా సోల్జర్స్కు సిఐడి వార్నింగ్
ముందు వెనుక ఆలోచించుకోకుండా ఏది పడితే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చిక్కుల్లో పడొద్దని ఏపీసిఐడి పోలీసులు యువతను హెచ్చరిస్తున్నారు. డబ్బులిస్తున్నారనే ఉద్దేశంతో అవాస్తవాలు, అనుచిత పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలను ప్రచారం చేస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
రాజకీయ నాయకులకు అనుకూలంగా, వ్యతిరేకంగా చెలరేగిపోతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు ఏపీ సిఐడి పోలీసులు పలు సూచనలు చేశారు. పెయిడ్ ప్రమోషన్లో భాగంగా అవాస్తవాలు ప్రచారం చేసి కేసుల్లో చిక్కుకోవద్దని సూచిస్తున్నారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు డబ్బు తీసుకుని ఒక వ్యక్తి గురించి, సంస్థల గురించి, రాజకీయ పార్టీల గురించి అనుచిత, అశ్లీల పోస్టులు పెట్టడం, అసభ్య పదజాలంతో కంటెంట్ తయారుచేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని అలాంటి చర్యలు చట్టవిరుద్ధమని ప్రకటించారు.
స్పష్టంగా తెలిసిన విషయాన్ని ఆధారాలతో సహా పెడితే ఎలాంటి తప్పులేదని, లేని విషయాలను సృష్టించి , మార్ఫింగ్ చేసి పోస్టులు పెడితే శిక్షార్హులవుతారని ప్రకటించారు. అవాస్తవాలు సర్క్యూలేట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని,డబ్బులు ఇచ్చి ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా ఇబ్బందులు తప్పవన్నారు.
తెలుదేశంపార్టీ అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న రాజమండ్రి కి చెందిన ఎల్లపు సంతోష్ను సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోను, మార్ఫింగ్ చేసి అశ్లీల పదజాలం చొప్పించి, దానిని ఎడిట్ చేసి సీబీఎన్ ఆర్మీ, పొలిటికల్ మోజీ, థాంక్యూ సీఎం సర్ యూట్యూబ్ చానెల్స్లో అప్ లోడ్ చేశారు. మార్ఫింగ్ వీడియో సృష్టికర్త, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ సోషల్ మీడియా చీఫ్ కో ఆర్డినేటర్ ఎల్లపు సంతోష్ రావు తన నేరాన్ని అంగకరించినట్లు పోలీసులు ప్రకటించారు.
" తెలుగుదేశం పార్టీ తరపున డబ్బు తీసుకుని ఇలా వీడియోలు పెడుతుంటానని, అనని మాటలను అన్నట్లుగా, తనకున్న సాంకేతిక నైపుణ్యం తో కొన్ని ప్రత్యేక మొబైల్, మరియు కంప్యూటర్ అప్లికేషన్లు ఉపయోగించి అసలు వీడియోలు మార్ఫింగ్ చేస్తున్నట్లు విచారణలో అంగీకరించినట్లు ప్రకటించారు. Thankyou CM sir, CBN Army, Political moji, open talk, telugu alerts యూట్యూబ్ చానెల్స్ లో అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులకు ఒప్పుకున్నాడు. యూ ట్యూబ్ ఛానల్స్లో ప్రచారం చేసినందుకు తెలుగుదేశం పార్టీ, సీబీఎన్ ఆర్మీ తరపున ప్రతినెల డబ్బులిస్తారని" సంతోష్ రావు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వరో ఇచ్చే డబ్బుకోసం, లాభాపేక్ష తో ప్రభుత్వాన్ని, మహిళలను, గౌరవ ప్రదమైన స్థానాల్లోని వారిని కించపరిచేలా తప్పుడు సమాచారాన్ని పెట్టినా, తప్పుడు భాషను వాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వారిపై కూడా కేసులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏదైనా పోస్టును, వీడియోను, కామెంట్ను షేర్ చేసే ముందు అది నిజమో కాదో నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారుే. చట్టపరమైన ఇబ్బందులు వచ్చే పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇరు వర్గాలమధ్య ఘర్షణలు రేకెత్తించే, అశ్లీల, అబద్ధపు పోస్టులను పెట్టవద్దని, ప్రజలు , యువత బాధ్యతయుతంగా మెలగాలని సిఐడి సూచిస్తోంది.
టాపిక్