AP SIPB : రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని.. సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. రానున్న ప్రతి పరిశ్రమలో ప్రభుత్వ విధానానికి అనుగుణంగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రావాలని స్పష్టం చేశారు. అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎస్ఐపీబీ ( The Andhra Pradesh State Investment Promotion Board (SIPB)) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. పలు భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని అధికారులను ఆదేశించిన సీఎం.... అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశించుకున్న సమయంలోగా వాటి కార్యకలాపాలు ప్రారంభం కావాలని చెప్పారు.,వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక... విద్యుత్ ప్రాజెక్ట్ల విధానంలో కీలక మార్పులు చేశామన్నారు సీఎం జగన్. పవర్ ప్రాజెక్టుల ద్వారా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే ఆదాయం వచ్చే పరిస్థితులు తీసుకొచ్చామన్నారు. తీసుకుంటున్న భూమికి ఎకరాకు ఏడాదికి రూ. 31 వేలు లీజు కింద చెల్లింపులు చేస్తున్నారని... దీనివల్ల కరవు ప్రాంతాల్లోని రైతులకు చక్కటి మేలు జరుగుతుందని అన్నారు. ప్రతి మెగావాట్ కు లక్ష రూపాయల చొప్పున రాష్ట్రానికి కంపెనీలు చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్జీఎస్టీ రూపంలో కూడా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుందన్న సీఎం... దీంతోపాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు.,ఎస్ఐపీబీ సమావేశంలో.. పలు భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ ఇంధన తయారీకి ముందుకు వచ్చిన అవిశా ఫుడ్స్ మరియు ఫ్యూయెల్స్ కంపెనీ ప్రతిపాదనలకు ఓకే చేశారు. ఈ సంస్థ.. మొత్తంగా రూ.498.84 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ ఏడాది జూన్ లో పనులు ప్రారంభించి.. వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.,కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టుకి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ రూ. రూ. 3,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. 2025 నాటికి నిర్వహణ ప్రారంభించనుంది.,ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కుకి ఆమోదం తెలిపారు. మొదటి విడతలో రూ.55వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు కలిపి.. మొత్తంగా రూ.1,10,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఫేజ్ వన్లో 30 వేలమందికి, ఫేజ్ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఈ పార్క్ లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, హైడ్రోజన్ సంబంధిత ఉత్పత్తులు తయారు చేయనున్నారు. మొదటి విడతను 2027 నాటికి, రెండో విడతను 2033 నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యం. ఇంధన రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు మార్చుకుని కొత్త తరహా ఇంధనాల ఉత్పత్తి లక్ష్యంగా ఎన్టీపీసీ ముందడుగు వేస్తోందని ప్రభుత్వం తెలిపింది.,శ్రీకాళహస్తి, పుంగనూరుల్లో ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ఫ్యాక్టరీల ఏర్పాటు ప్రతిపాదనలకు సీఎం అధ్యక్షతన సమావేశమైన ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్లు, పుంగనూరులో రూ.171.96కోట్లతో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తోన్న సంస్థ..,డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ చేయనుంది. మొత్తంగా రూ. 1087 కోట్ల పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా 2,350 మందికి ఉపాధి కల్పించనుంది. 2023, డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తిచేయాలన్నది లక్ష్యం.,రామాయపట్నంలో అకార్డ్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ. 10వేల కోట్ల పెట్టుబడితో... కాపర్ కాథోడ్, కాపర్ రాడ్, సల్ఫూరిక్ యాసిడ్, సెలీనియం మరియు ప్రత్యేక ఖనిజాలు తయారీ చేయనున్నారు. దీనిద్వారా ప్రత్యక్షంగా 2500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మే 2023లో ప్రారంభమై, జూన్ 2025 నాటికి నిర్వహణలోకి తేనున్నారు.,వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలను నిషేధించిన నేపథ్యంలో ప్రణాళికలను మార్చుకున్న జేఎస్డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్.... ఫ్యాక్టరీ కోసం ప్రెవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల భూమిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.,కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ మరియు సోలార్ పవర్ ప్రాజెక్ట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ... 1000 మెగావాట్ల విండ్, మరియు 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్లు ఏర్పాటు చేయనుంది. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ యూనిట్ ల ద్వారా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. 2027 నాటికి పూర్తిగా నిర్వహణలోకి రానున్నాయి.,విశాఖపట్నంలోని కాపులుప్పాడలో వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం దక్కింది. మొదటి విడతలో 10 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేసి... మూడేళ్ళలో పూర్తిగా నిర్వహణలోకి తెచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా రూ.7,210 కోట్ల పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా 14,825 మందికి, పరోక్షంగా 5,625 మందికి, మొత్తంగా 20,450 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న 200 మెగావాట్ల డేటా పార్క్ కి ఇది అదనం అని ప్రభుత్వం తెలిపింది.,వింగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1489.23 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. టెలీ కమ్యూనికేషన్ ఇంటిగ్రేషన్, సెమికండక్టర్, ఆప్టికల్ మాడ్యూల్స్ ను తయారు చేయనున్న ఈ కంపెనీ ద్వారా 15 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.,భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఐటీ పార్కు అత్యాధునిక సదుపాయాలతో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ఆ మేరకు ప్రణాళికలు రూపొందించాలని... వాటిని పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు.