Akash Airlines : ఏపీలో విమానయాన సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం….
Akash Airlines ఆంధ్రప్రదేశ్లో విమానయాన సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ ప్రాంతాల మధ్య నూతన సర్వీసుల్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి ఆకాశ్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసుల్ని లాంఛనంగా ప్రారంభించారు.
Akash Airlines ఏపీలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసుల్ని పెంచుతున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలో విమానయాన సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తోందని, రద్దీకి తగ్గట్లుగా నూతన సర్వీసుల్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సహకారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో ఆకాశ ఎయిర్ లైన్స్ విమాన సేవలను మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.
రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఉండగా వాటిలో మరిన్ని నూతన సర్వీసులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా పలు ఎయిర్ లైన్స్ సంస్థలకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర భారీ పరిశ్రమలు ,ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆకాశ ఎయిర్ లైన్స్ కు చెందిన నూతన సర్వీసును మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. నూతన సర్వీసు విశాఖ నుంచి నేరుగా బెంగళూరుకు, బెంగళూరు నుంచి విశాఖకు రాకపోకలు సాగిస్తుందన్నారు.
ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు మరిన్ని విమానాలు అదనముగా నడపడం వల్ల ప్రయాణికులకు సులభతరమైన రాకపోకలు సాగించేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి చెప్పారు. విశాఖ విమానాశ్రయం వేదికగా ఆకాశ సంస్ధ తన సర్వీసులను ప్రారంభించడం అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విశాఖ నుంచి నూతన సర్వీసులు నడపాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరినట్లు మంత్రి చెప్పారు.
హైదరాబాద్ , ఢిల్లీ,గోవా నగరాలకు నూతన సర్వీసులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆకాంక్షించారు, ప్రస్తుతం ఆకాశ సంస్థ 9 ప్రధాన నగరాల్లో తన సర్వీసులను నడుపుతోందని విశాఖ నుంచి తన పదో శాఖ ప్రారంభించిండము అభినందనీయం అన్నారు.. విశాఖలో త్వరలో గ్లోబల్ సమ్మిట్ జరగనుందని , అలాగే జి 20 సమావేశాలకు సంబంధించి కూడా విశాఖ వేదిక కానుందని కాబట్టి మరిన్ని విమాన సర్వీసులు అవసరం ఉందన్నారు. ఆకాశ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్అయ్యర్ , ఆకుల అరవింద్, సాగర్ నాయక్ లు మాట్లాడుతూ ఇప్పటివరకు విశాఖతో కలుపుకొని 10 నగరాల్లో తమ సంస్థ సేవలు ప్రారంభించినట్లు చెప్పారు, త్వరలో హైదరాబాద్, లక్నో, గోవాలో తమ సంస్థ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు.
ప్రతిరోజు 58 సర్వీసులు దేశంలో పలు నగరాలకు నడుపుతున్నామన్నారు.ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ విమానాశ్రయం నుంచి ఆకాశ సంస్థ తన సేవలు ప్రారంభించడము అభినందనీయమన్నారు. విమానయాన సంస్థకు అవసరమైన సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు. త్వరలోనే మరిన్ని సర్వీసులు విశాఖ నుంచి నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే విశాఖ నుంచి ప్రయాణించే ప్రయాణికులు సంఖ్య పెరుగుతుందన్నారు. దుబాయ్ కు విశాఖ నుంచి నేరుగా ఎయిర్ ఇండియా విమానం ఉండేదని అది ప్రయాణికులకు అత్యంత సౌలభ్యముగా ఉండేదని తిరిగి దుబాయ్ విమానాన్ని పునరుద్ధరించాలని, ముఖ్య నగరాలకు విమాన సర్వీసులు పెరిగితే ఆయా ప్రాంత ప్రజలకు మేలు కలుగుతుంది స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇతర నగరాలకు వెళ్లాలంటే వేర్వేరు విమానాశ్రయాలకు వెళ్లి అక్కడ నుంచి వెళ్లాల్సి రావడం ప్రజలకు భారంగా మారుతుందన్నారు.ప్రయాణీకులకు ఇబ్బందులూ తప్పడము లేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.