CM jagan Delhi Tour: మళ్లీ ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్…-ap cm jaganmohan reddy who will go to delhi tomorrow and speculations about the cms visit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Delhi Tour: మళ్లీ ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్…

CM jagan Delhi Tour: మళ్లీ ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్…

HT Telugu Desk HT Telugu
Mar 28, 2023 01:57 PM IST

CM jagan Delhi Tour: ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి మరోమారు ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం సిఎం జగన్, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రెండు వారాల వ్యవధిలోనే సిఎం రెండో సారి ఢిల్లీ వెళుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాని మోడీతో సీఎం జగన్(ఫైల్ ఫొటో)
ప్రధాని మోడీతో సీఎం జగన్(ఫైల్ ఫొటో)

CM jagan Delhi Tour: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు వారాల వ్యవధిలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయిన సీఎం జగన్ ఆ వెంటనే ఢిల్లీ పర్యటనకు వెళుతుండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రాజకీయంగా నెలకొంది. ఈ నెల 17న ప్రధానితో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు.

మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని ఆశావహులు ప్రచారం చేసుకుంటున్నారు.

శాసన మండలి నుంచి ఇద్దరికి అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. మరో వైపు మంత్రుల్లో ఎవరికి పదవి దక్కుతుందో, ఎవరి పదవి ఊడుతుందోననే టెన్షన్‌తో సతమతమవుతున్నారు. ఎన్నికలు జరిగిన 21 స్థానాల్లో 17 ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. మరోవైపు గత ఏడాది జరిగిన మంత్రి వర్గ పునఃర్వ్యస్థీకరణలో పలువురు మంత్రి పదవులు కోల్పోయారు.

కమ్మ, క్షత్రియ, వైశ్య,బ్రహ్మణ సామాజిక వర్గాలకు ఏపీ క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని రెండు,మూడు స్థానాల్లో మార్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చించే అంతటి స్వేచ్ఛ, ధైర్యం క్యాబినెట్ సహచరుల్లో కూడా ఎవరికి లేదు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి దగ్గర కనీసం తమకు పదవులు కావాలని విజ్ఞప్తి చే రిక్వెస్ట్‌ పెట్టుకోడానికి అవకాశం లేకపోవడంతో ఇప్పటి వరకు అవకాశం దక్కని వారిలో తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన ఉంది. రెండు మూడు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. శాసన మండలి నుంచి ఇద్దరిని మంత్రి మండలిలోకి తీసుకుంటే పదవులు కోల్పోయే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ కూడా సాగుతోంది. ఏ జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇస్తారో సామాజిక సమీకరణలతో లెక్కలు వేసుకుంటున్నారు.

ఏ ప్రాంతం నుంచి ఏ కులానికి చెందిన వారిని మంత్రి వర్గం నుంచి తొలగిస్తారనే దానిపై రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు. వీరిలో తూర్పు, పశ్చిమ గోదావరి మంత్రులకే గండం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏడాదిలో ఎన్నికల జరుగనుండటంతో పాటు, తాజా ఫలితాల నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ జోలికి వెళ్తారో లేదోనన్న సందేహం కూడా పార్టీ నాయకుల్లో ఉంది.

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు.. పట్టభద్ర, ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో అధికార పక్షానికి చేదు ఫలితాలు ఎదురైన నేపథ్యంలో కేబినెట్‌ను సీఎం విస్తరిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.ఈ నెల 14వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో.. మంత్రులు తమ పనితీరు మెరుగుపరచుకోకుంటే రెండు మూడు వికెట్లు పడిపోతాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేసిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జోలికి వెళ్తే తేనెతుట్టెను కదిల్చినట్లేనని జగన్‌ భావించే అవకాశం కూడా ఉండొచ్చని చెబుతున్నారు. సిఎం ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్