High Court Relief to RRR : గవర్నర్ ప్రమాణానికి రఘురామ రాకపై సస్పెన్స్
High Court Relief to RRR ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తోన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరయ్యేందుకు అటంకాలు లేకుండా చూడాలంటూ హైకోర్టును రఘురామ ఆశ్రయించారు. ఈ కేసులో గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను ఏపీ పోలీసులు పాటించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
High Court Relief to RRR ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాలని రఘురామకృష్ణరాజు పట్టు విడవకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దాదాపు రెండేళ్లకు పైగా నియోజకవర్గానికి దూరమైన రఘురామ, ఏపీ నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని భావించారు. తనకు ఆహ్వానం లభించిందని, ఏపీ వెళితే పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
ట్రెండింగ్ వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన రెండు కేసుల్లో తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని రఘురామ అనుమానిసత్ున్నారు. దీంతో అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు వ్యవహరించాలని ఏపీ పోలీసులకు హైకోర్టు తేల్చిచెప్పింది.
ప్రధాన వ్యాజ్యాల్లో కౌంటర్ వేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఎంపీ రఘురామ ప్రోద్బలంతో ఆయన మద్దతుదారులు ర్యాలీలు తీస్తూ అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు అవరోధం కలిగిస్తున్నారని, కులమతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర, కాళ్ల స్టేషన్ల పోలీసులు గతేడాది ఎంపీపై కేసులు నమోదు చేశారు. వాటిని కొట్టేయాలని ఎంపీ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నియోజకవర్గానికి రావాలని రఘురామ చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. చివరి నిమిషంలో రైలు నుంచి దిగి వెనక్కి వెళ్లిపోయారు.
మరోవైపు ఏపీ పోలీసులపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై టిషనర్ తరఫున న్యాయవాది ఉమేశ్చంద్ర వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 24న జరిగే గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలంటే కేసులు అవరోధంగా ఉన్నాయని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంతోనే రఘురామపై తప్పుడు కేసులు నమోదు చేసి, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో దేశద్రోహం కేసుపెట్టి అరెస్టు చేసి, చిత్రహింసకు గురిచేశారని కోర్టుకు వివరించారు.
ఈ నేపథ్యంలో పిటిషనర్ను పోలీసులు అరెస్టు చేయకుండా, తొందరపాటు చర్యలు తీసుకోకుండా తగిన ఆదేశాలివ్వాలని కోరారు. పోలీసుల తరఫున అదనపు పీపీ దుష్యంత్రెడ్డి వాదనలు వినిపించారు. 'భావప్రకటన స్వేచ్ఛ పేరుతో దుర్భాషలాడొద్దు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాణ స్వీకారానికి రఘురామకు మౌఖికంగా ఆహ్వానం ఉందేకానీ రాతపూర్వకంగా లేదన్నారు. ఏడేళ్లలోపు జైలుశిక్ష పడేందుకు వీలున్న అన్ని కేసుల్లో తప్పనిసరిగా 41ఏ నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు అర్నేష్కుమార్ కేసులో చెప్పలేదన్నారు. రఘురామపై నమోదైన కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు తు.చ.తప్పకుండా పాటించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుత వ్యాజ్యాల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని విజ్ఞప్తి చేశారు. కౌంటర్ వేయడానికి సమయం ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి భానుమతి. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం రాతపూర్వకంగానే ఉండాల్సిన అవసరం లేదన్నారు. అరెస్టుపై ఎంపీకిఆందోళన ఉన్నందున పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారని, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు.
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎంపీ రఘురామ గవర్నర్ ప్రమాణస్వీకారానికి హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.