December 09 Telugu News Updates : భారత్ రాష్ట్ర సమితిగా అవతరించిన టిఆర్ఎస్
- తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా అవతరించింది. పార్టీ పేరు మార్పు ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం అమోద ముద్ర వేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇకపై బిఆర్ఎస్ పరిగణించడానికి ఎన్నికల సంఘం అమోదం తెలపడంతో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సమావేశాన్ని నిర్వహించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. హైదరాబాద్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవిర్భావ సభకు హాజరు కావాలంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ముఖ్య నాయకులకు ఆహ్వానాలు పంపారు.
Fri, 09 Dec 202204:59 PM IST
కేంద్రం ప్రకటన…
విదేశాల్లోని జైళ్లలో భారతీయ ఖైదీలు ఎంత మంది ఉన్నారనే దానిపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. విదేశాల్లో దాదాపు 8,441 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఇందులో 4,389 మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నట్లు చెప్పారు.
Fri, 09 Dec 202202:37 PM IST
జోగి రమేశ్ ఫైర్…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేశ్ ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు... దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయటంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అసలు అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉందా..? అని నిలదీశారు. బీసీల కోసం టీడీపీ ఏం చేసిందనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం ప్రతి గడపకు వెళ్తోందని అన్నారు. టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Fri, 09 Dec 202202:37 PM IST
10 మంది మృతి…
ఇండోనేషియాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
Fri, 09 Dec 202212:22 PM IST
టికెట్లు విడుదల…
జనవరి నెలకు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
Fri, 09 Dec 202211:49 AM IST
యువతి కిడ్నాప్..
Youn woman kidnap in Turkayamjal: రంగారెడ్డి జిల్లాలో ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువతి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని రాగన్నగుడాలో నివసిస్తున్న వైశాలి అనే యువతి.. డాక్టర్(డెంటల్)గా పనిచేస్తుంది. ఆమె ఇంటికి ఒక్కసారిగా వంద మంది రౌడీ గ్యాంగ్ వచ్చి వైశాలిని కిడ్నాప్ చేశారు. ఇంట్లోని సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇదంతా మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి చేసినట్లుగా తెలుస్తోంది.
Fri, 09 Dec 202209:51 AM IST
వారాహిపై వివాదం..
pawan Varahi Vehicle Controversy: త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు సిద్దం అవుతున్నారు. ఇందుకోసం ఓ బస్సును ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. దీనికి 'వారాహి' అని పేరు కూడా పెట్టారు. అయితే బస్సు రంగు మాత్రం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్దమంటూ సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బస్సు రిజిస్ట్రేషన్ అవుతుందా..? లేక రంగు మారుతుందా..? అనేది ఆసక్తిగా మారింది.
Fri, 09 Dec 202209:51 AM IST
గంజాయి చాక్లెట్లు…
Ganja Chocolates Seized at Patancheru: సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్ చెరులో గంజాయి చాక్లెట్ల కలకలం రేపాయి. 3 పాన్ షాప్ ల్లో అమ్ముతున్న 271 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Fri, 09 Dec 202209:50 AM IST
మళ్లీ కుట్ర - పొన్నం ప్రభాకర్
ఏపీని, తెలంగాణను మళ్లీ కలపాలన్నదే తమ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల, అది ఎప్పటికీ నిజం కాదన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత మళ్లీ కుట్రపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సమైక్యాంధ్ర అనేది ముగిసిన అధ్యాయం అని, ఇప్పుడు కలపాలనే కొత్త ఆలోచన చేయాలనే సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
Fri, 09 Dec 202208:03 AM IST
బీఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి కుమారస్వామి
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న కుమారస్వామికి శంషాబాద్ విమానాశ్రయంలో పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి, సుమన్ లు పూలమాలలు, శాలువాలతో కుమారస్వామిని సన్మానించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కుమార స్వామి, ఆయన వెంట వచ్చిన పలువురు కర్ణాటక రాష్ట్ర నేతలు బీఆర్ ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ భవన్ కు వెళ్లారు.
Fri, 09 Dec 202208:00 AM IST
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం
తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. రెండు దశాబ్దాల టిఆర్ఎస్ ప్రస్తానం మరో మలుపు తీసుకుంది. గులాబీ రంగు జెండాపై భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించింది. కొత్త పార్టీ పేరును అధికారికంగా ఖరారు చేస్తూ పత్రాలపై కేసీఆర్ సంతకాలు చేశారు.
Fri, 09 Dec 202207:57 AM IST
తెలంగాణ భవన్లో కోలాహలం….
టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్గా మారుస్తుండటంతో తెలంగాణ భవన్లో కోలాహలం నెలకొంది. మరికొద్దిసేపట్లో పార్టీ నాయకుల సమక్షంలో పార్టీ పేరు మార్పుపై, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ అధికారిక ప్రకటన చేయనున్నారు.
Fri, 09 Dec 202207:27 AM IST
1998 క్వాలిపైడ్ అభ్యర్థుల నిరసన
విజయవాడ ధర్నా చౌక్ వద్ద డీఎస్సీ 1998 క్వాలిపైడ్ అభ్యర్థుల నిరసన చేపట్టారు. తక్షణమే తమకు నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దస్త్రంపై సీఎం సంతకం పెట్టి 6 నెలలైనా నియామక పత్రాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Fri, 09 Dec 202207:26 AM IST
బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా….
ఎర్ర గంగిరెడ్ది బెయిల్ రద్దుపై విచారణను సుప్రీం కోర్టు జనవరి 3కు వాయిదా వేసింది. గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు ఎక్కువ సమయం వినాలనుకుంటున్నామన్న సుప్రీం కోర్టు పేర్కొంది.
Fri, 09 Dec 202206:11 AM IST
చింతలపూడి జడ్పీ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్
ఏలూరు జిల్లా చింతలపూడి జడ్పీ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఘటనలో సుమారు 30 మంది విద్యార్థినులకు అస్వస్థత కలిగింది. రాత్రి భోజనం చేశాక కడుపునొప్పి, వాంతులకు గురైన విద్యార్థినులను వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హాస్టల్ లోనే విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు. న్ ట్యాబెట్లు వికటించడంతో అస్వస్థతకు గురయ్యారని సిబ్బంది చెబుతున్నారు. ఫుడ్ పాయిజనే కారణమని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.
Fri, 09 Dec 202206:09 AM IST
శంషాబాద్ మెట్రోకు కేసీఆర్ శంకుస్థాపన
శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో మార్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపనచేశారు. మెట్రో సెకండ్ ఫేజ్కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.6,250 కోట్ల నిధులతో ఎయిర్పోర్ట్ మెట్రో విస్తరణ చేపడుతున్నారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో వరకు 31 కి.మీ. దూరం 26 నిమిషాల్లో చేరుకునేలా మెట్రో నిర్మాణం చేపడుతున్నారు. ఈ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉండేలా ప్లాన్ చేశారు.
Fri, 09 Dec 202205:38 AM IST
వైసీపీ ప్రభుత్వం.. క్షమాపణ చెప్పాలి
రాష్ట్ర విభజనపై మాట్లాడిన వైసీపీ ప్రభుత్వం.. క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్ చేసింది. ఏపీ ఆస్తులు తెలంగాణకు కట్టబెట్టేశారని, ఇప్పుడేమో రాష్ట్రం కలిసివుంటే బాగుంటుందంటున్నారని విమర్శించారు. ప్రజలను అయోమయ స్థితిలోకి నెట్టేలా మాట్లాడుతున్నారని నాదెండ్ల విమర్శించారు.
Fri, 09 Dec 202205:36 AM IST
టీ స్టాల్ తగులబెట్టిన కార్పొరేటర్ భర్త
కృష్ణా జిల్లా మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీ క్యాంటీన్ దగ్గర మద్యం మత్తులో కార్పొరేటర్ భర్త వీరంగం వేశాడు. 42వ వార్డు డివిజన్ వైసీపీ కార్పొరేటర్ భర్త చీలి చక్రపాణి గొడవ పడ్డాడు. తన సెల్ ఫోన్ పోయిందంటూ క్యాంటీన్ నిర్వహిస్తున్న వారితో ఘర్షణకు దిగాడు. పెట్రోల్ పోసి టీ స్టాల్కు నిప్పు పెట్టడంతో క్యాంటీన్ తగులబడింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనలో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.
Fri, 09 Dec 202205:34 AM IST
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
కృష్ణా జిల్లా పెదపారుపూడిలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టైంది. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రూ.29,500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్ల మార్పిడిలో వాలంటీర్ల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లను వైసీపీ నేతలు కాపాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Fri, 09 Dec 202205:33 AM IST
మద్యం షాప్ లో సిబ్బంది చేతివాటం
కాకినాడ జిల్లా కాట్రావులపల్లి ప్రభుత్వ మద్యం షాప్ లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. మద్యం బాటిల్స్ లో సగం మందు తీసి నీళ్లు కలుపుతున్న వైనం బయటపడింది. నీళ్లతో నింపిన మద్యం బాటిళ్లను అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో మద్యం దుకాణం మూసేసి ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. నలుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.
Fri, 09 Dec 202204:20 AM IST
వాహనం రంగుపై పవన్ ట్వీట్
తన వారాహి వాహనంపై వైసీపీ విమర్శలపై పవన్ స్పందించారు. తొలుత నా సినిమాలు ఆపేశారని, తర్వాత విశాఖలో వాహనం, హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదని, విశాఖ వదిలి వెళ్లమని బలవంతం చేశారని, మంగళగిరిలో నా కారు బయటకు రానివ్వలేదని, ఇప్పుడు వాహనం రంగు సమస్యగా మారిందని ట్వీట్ చేశారు. కనీసం ఆలివ్ రంగు చొక్కా అయినా వేసుకొనిస్తారో లేదోనని ఎద్దేవాచేశారు.
Fri, 09 Dec 202204:19 AM IST
అల్లూరి జిల్లా ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లంబసింగిలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత చేరుకుంది. మినుములూరు 14, చింతపల్లి, అరకులో 15 డిగ్రీలు, పాడేరులో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
Fri, 09 Dec 202204:18 AM IST
చంద్రబాబు పర్యటన….
రెండోరోజు బాపట్ల జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ముస్లిం సంఘాలతో చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం చుండూరుపల్లిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. ఏతేరు, అప్పికట్ల మీదుగా రాత్రికి బాపట్ల చేరుకోనున్నారు. రాత్రికి బాపట్లలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
Fri, 09 Dec 202204:18 AM IST
దీక్షకు సిద్ధమైన ఫర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ కార్యాలయంలోనే దీక్షకు దిగనున్నారు. షర్మిల పాదయాత్రకు అనుమతి లభించకపోవడంతో షర్మిల ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నర్సంపేట పోలీసులను వైఎస్ఆర్టీపీ నేతలు కలిసి యాత్రకు అనుమతి కోరినా పోలీసుల నుంచి స్పందన లభించలేదు.
Fri, 09 Dec 202204:16 AM IST
సజ్జలపై పెద్ది సుదర్శన్ ఫైర్….
ఏపీ సలహదారు సజ్జలపై తెలంగాణ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఫైర్ అయ్యారు. మళ్లీ ఏపీ, తెలంగాణను కలిపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. షర్మిల పాదయాత్రలో తాజా పరిణామాలే ఇందుకు నిదర్శనమని, కేసీఆర్ పాలన, ప్రభుత్వ అస్థిరతే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి జెండాలు వేరైనా.. ఎజెండా మాత్రం ఒక్కటేనన్నారు. ఆంధ్ర నేతలు తెలంగాణలో మకాం వేస్తూ.. పథక రచన చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఆరోపించారు.
Fri, 09 Dec 202204:15 AM IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడిన మాండూస్
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మాండూస్ బలపడింది. శ్రీలంకలోని జఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కారైకాల్కు 320 కిలోమీటర్లు, చెన్నైకి 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తున్న తుఫాను, రేపు ఉదయం నుంచి క్రమంగా బలహీనపడుతుందని అంచనావ వేస్తున్నారు. అర్ధరాత్రి మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 65-85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
Fri, 09 Dec 202204:20 AM IST
ఏపీ-తెలంగాణ మళ్లీ కలవడం అసంభవం
ఏపీ-తెలంగాణ మళ్లీ కలవడం అసంభవం అని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆకస్మికంగా వచ్చింది కాదని, ఎన్నో పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. అవకాశం ఉంటే మద్రాస్ లో మళ్లీ ఏపీని కలపాలని అడగొచ్చని, ఏపీ-తెలంగాణ మళ్లీ కలవాలనడం తెలివి తక్కువ ఆలోచన అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.