Bumrah gone to NCA: బుమ్రా గాయంపై ద్రవిడ్ అప్డేట్.. అధికారిక ధ్రువీకరణ కోసం చూస్తున్నట్లు వెల్లడి
Dravid about Buymrah Injury: బుమ్రా గాయంపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అప్డేట్ ఇచ్చారు. బుమ్రా పరిస్థితి నిపుణుల ప్రకటన ఆధారంగా తమ తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
Rahul Dravuid Abourt Japrit Bumrah: టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపించనుంది. ఎందుకంటే ఇప్పటికే భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టుకు దూరం కాగా.. తాజాగా జస్ప్రీత్ బుమ్రా కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గాయం కారణంగా ఆసియా కప్నకు దూరమైన బుమ్రా.. ఇటీవలే ఆస్ట్రేలియాతో సిరీస్కు పునరాగమనం చేశాడు. తాజాగా బుమ్రా వెన్నునొప్పి టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది. వెన్నునొప్పి కారణంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరమైన ఈ స్టార్ పేసర్.. ఐసీసీ టీ20 వరల్డ్ కప్నకు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.
సౌతాఫ్రికా సిరీస్కు దూరమైన బుమ్రా ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీలో(NCA) చికిత్స పొందుతున్నాడు. అతడి గాయం తీవ్రతపై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. బుమ్రా గాయం తీవ్రమైనందున.. టీ20 ప్రపంచకప్నకు అతడు దూరమవడం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. అతడి పరిస్థితి గురించి రాహుల్ ద్రవిడ్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. బుమ్రా గాయం గురించి ప్రస్తుతం బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు.
"ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్కు జస్ప్రీత్ బుమ్రాను దూరంగా ఉంచాం. అతడు ప్రస్తుతం ఎన్సీఏలో చికిత్స పొందుతున్నాడు. తదుపరి కార్యచరణపై అధికారిక ధ్రువీకరణ కోసం మేము ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మేము అధికారిక కన్ఫార్మేషన్ పొందిన తర్వాత ఈ విషయంపై స్పందిస్తాం" అని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు.
మెడికల్ రిపోర్టులను గురించి పరిశీలించలేదని, నిపుణులు ఏం చెబుతారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని ద్రవిడ్ తెలిపారు. అధికారికంగా ధ్రువీకరించేంత వరకు మేము ఆశాజనకంగానే ఉంటామని ద్రవిడ్ అన్నారు.
జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడటంతో దక్షిణాఫ్రికాతో సిరీస్లో జరగనున్న మిగిలిన రెండు మ్యాచ్లకు మహమ్మద్ సిరాజ్కు అవకాశం కల్పించారు సెలక్టర్లు. అయితే టీ20 వరల్డ్ కప్లో బుమ్రా స్థానంలో ఎవరు ఆడతారనేది మాత్రం సందిగ్ధంగా మారింది. స్టాండ్ బై ప్లేయర్లుగా ఉన్న దీపక్ చాహర్ లేదా మహమ్మద్ సిరాజ్లో ఒకరు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
సంబంధిత కథనం