Syed Mushtaq Ali Trophy: 46 బాల్స్లో సెంచరీ బాదిన పృథ్వీ.. 27 బాల్స్లోనే పుజారా ఫిఫ్టీ
Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లలో చెలరేగిపోయారు పృథ్వీ షా, చెతేశ్వర్ పుజారా. పృథ్వీ 46 బాల్స్లో సెంచరీ బాదగా.. పుజారా 27 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కొట్టడం విశేషం.
Syed Mushtaq Ali Trophy: ముంబై కెప్టెన్ పృథ్వీ షా టీ20ల్లో తన తొలి సెంచరీ చేశాడు. అది కూడా అలా ఇలా కాదు.. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కేవలం 46 బాల్స్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా అస్సాంతో శుక్రవారం (అక్టోబర్ 14) సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పృథ్వీ కేవలం 61 బాల్స్లోనే 134 రన్స్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
హాఫ్ సెంచరీని కేవలం 19 బాల్స్లోనే పూర్తి చేసిన అతడు.. తర్వాత సెంచరీని కూడా అందుకున్నాడు. పృథ్వీ ఇన్నింగ్స్లో 9 సిక్స్లు, 13 ఫోర్లు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్లో తన అత్యుత్తమ ఫామ్ను ఈ సెంచరీతో కొనసాగించాడు పృథ్వీ షా. అతని మెరుపు ఇన్నింగ్స్తో ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 రన్స్ చేసింది. ముస్తాక్ అలీ టోర్నీలో ఇది 8వ అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.
ప్రస్తుతం ఈ రికార్డు ఇండియన్ టీమ్ వికెట్ కీపర్గా ఉన్న రిషబ్ పంత్ పేరిట ఉంది. అతడు 2018లో హిమాచల్ ప్రదేశ్పై కేవలం 34 బాల్స్లోనే సెంచరీ బాదాడు. 2019లో పృథ్వీ షా కూడా ఐపీఎల్లో సెంచరీకి చేరువగా వచ్చినా.. 99 రన్స్ దగ్గర ఔటయ్యాడు. మొత్తానికి ఇన్నాళ్లకు టీ20 ఫార్మాట్లో సెంచరీ చేయడం విశేషం. అతని ధాటికి అస్సాం బౌలర్ మృన్మయ్ దత్తా 2 ఓవర్లలోనే 41 రన్స్ ఇచ్చాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీ టాప్ ఫామ్లో ఉన్నాడు. తొలి మ్యాచ్లోనే అతడు మిజోరంపై 55 రన్స్ చేయగా.. తర్వాత మధ్యప్రదేశ్పై 29 రన్స్ చేశాడు. ఇక మూడో మ్యాచ్లో అస్సాంపై ఏకంగా సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు దులీప్ ట్రోఫీలోనూ వెస్ట్ జోన్ తరఫున ఆడిన పృథ్వీ రెండు సెంచరీలు బాదాడు. చెన్నైలో న్యూజిలాండ్ ఎ టీమ్పై ఇండియా ఎ తరఫున 77 రన్స్ చేశాడు.
పుజారా 35 బాల్స్లో 62 రన్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చెతేశ్వర్ పుజారా కూడా చెలరేగాడు. సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న అతడు నాగాలాండ్పై కేవలం 27 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చివరికి 35 బాల్స్లో 62 రన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి.
ఇంగ్లండ్లో రాయల్ లండన్ కప్ నుంచి వైట్ బాల్ క్రికెట్లోనూ పుజారా చెలరేగుతున్నాడు. ఆ టోర్నీలో ససెక్స్ తరఫున ఆడిన పుజారా 9 మ్యాచ్లలోనే 624 రన్స్ చేశాడు. అందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 174 కావడం విశేషం.