Gyanvapi mosque case: హిందువుల పిటిషన్ విచారణకు యోగ్యమైనదే: కోర్టు
జ్ఞాన్వాపి మసీదులో హిందువుల పూజలకు అనుమతించాలని కోరుతూ కొందరు భక్తులు దాఖలు చేసిన పిటిషన్ విచారణాయోగ్యమైనదేనని జిల్లా కోర్టు తేల్చింది.
జ్ఞాన్వాపి మసీదులో రోజూ హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి ఇవ్వాలన్న హిందూ ఆరాధకుల అభ్యర్థనను సవాలు చేస్తూ అంజుమన్ కమిటీ వేసిన పిటిషన్ను వారణాసిలోని జిల్లా కోర్టు సోమవారం తిరస్కరించింది. మసీదులో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని, వాటిని పూజించేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అంజుమన్ కమిటీ సవాలు చేసింది.
జ్ఞాన్వాపి మసీదు- శృంగార్ గౌరీ వివాద కేసులో జిల్లా జడ్జి ఎ.కె.విశ్వేష్తో కూడిన సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించింది.
కాగా ముస్లింల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అంజుమన్ ఇంతేజామియా కమిటీ హైకోర్టును ఆశ్రయించనుంది.
కోర్టు ముస్లిం పక్షం అభ్యర్థనను తిరస్కరించినట్లు హిందూ ఆరాధకుల తరపు న్యాయవాది మన్ బదూర్ సింగ్ తెలిపారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అన్ని సున్నిత ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తం చేశారు. పెట్రోలింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ‘శాంతిభద్రతలు కాపాడాలని మత పెద్దలు ప్రకటనలు జారీ చేశారు’ అని శాంతిభద్రతల ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
వారణాసిలో ప్రస్తుతం సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. రెండు వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
మతపరమైన సున్నితమైన ఈ అంశంలో జిల్లా న్యాయమూర్తి గత నెలలో ఉత్తర్వులను రిజర్వ్ చేసి ఈరోజు వెలువరించారు. తదుపరి విచారణను సెప్టెంబరు 22కు వాయిదా వేశారు.
టాపిక్