Newly-Weds Dead: కాసేపట్లో రిసెప్షన్.. కత్తిపోట్లతో కొత్త దంపతులు మృతి.. ఏం జరిగిందంటే!-newly weds dies with stab injuries before reception ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Newly Weds Dies With Stab Injuries Before Reception

Newly-Weds Dead: కాసేపట్లో రిసెప్షన్.. కత్తిపోట్లతో కొత్త దంపతులు మృతి.. ఏం జరిగిందంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 22, 2023 06:06 PM IST

Newly-Weds Found Dead: పెళ్లయిన మూడు రోజులకే నూతన దంపతులు మృతి చెందారు. రిసెప్షన్ వేడుకకు కొద్దిసేపటి ముందు కత్తిపోట్లతో చనిపోయారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Newly-Weds Found Dead: మరికాసేపట్లో రిసెప్షన్ జరుగుతుందనగా.. కొత్తగా పెళ్లయిన దంపతులు ఇద్దరూ మృతి చెందారు. కత్తిపోట్లతో రక్తపుమడుగులో కన్నుమూశారు. వివాహం జరిగిన మూడు రోజులకే ఈ దారుణం జరిగింది. చత్తీస్‍గఢ్‍ (Chhattisgarh) లోని రాయ్‍పూర్ (Raipur) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వివరాలను వెల్లడించారు.

ఇద్దరూ గొడవ పడి!

Newly-Weds Found Dead: మృతులను అస్లాం (24), కాకషా బానో (22)గా పోలీసులు వెల్లడించారు. వరుడి ఇంట్లోనే రిసెప్షన్ జరగాల్సింది. అయితే రిసెప్షన్ మొదలయ్యే కాసేపటి ముందు దంపతులు ఇద్దరూ ఓ రూమ్‍లోకి వెళ్లారు. గదిలో దంపతులిద్దరికీ తీవ్రమైన గొడవ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా అస్లాం.. తన భార్యను కత్తితో పొడిచి ఉంటాడని, ఆ తర్వాత తనను తాను పొడుచుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బ్రిజ్‍నగర్‌లోని తిక్రపర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Newly-Weds Found Dead: అస్లామ్, బానోకు ఆదివారమే వివాహం జరిగింది. మంగళవారం రాత్రి రిసెప్షన్‍కు ఏర్పాటు చేశారు. రిసెప్షన్‍కు అంతా సిద్ధమయ్యాక.. రెడీ అయ్యేందుకని చెప్పి వారు ఓ గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో తమ కూతురు కేకలు తమకు వినిపించాయని, వెంటనే ఆ గది వద్దకు వెళ్లామని వధువు తల్లి చెప్పినట్టు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

“ఆ రూమ్‍కు లోపలి నుంచి తాళం పెట్టుకున్నారు. పిలిచినా వారు పలకకపోవటంతో కిటికీ తెరిచి బయటి వారు ఆ ఇద్దరినీ చూశారు. రక్తపు మడుగులో స్పృహ లేకుండా ఉండడాన్ని గమనించారు. వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేశారు” అని ఆ పోలీస్ అధికారి వెల్లడించారు.

Newly-Weds Found Dead: బంధువుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపును పగులగొట్టి లోపలికి వెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. అలాగే కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. “దంపతులిద్దరి మధ్య వాదన మొదలై, ముందుగా వరుడు తన భార్యపై కత్తితో దాడి చేసి తర్వాత తనను తాను పొడుచుకొని ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నాం” అని పోలీస్ అధికారి చెప్పారు. అన్ని విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

IPL_Entry_Point