26/11 ముంబై దాడుల సూత్రధారికి 15ఏళ్ల జైలు శిక్ష!
లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మజీద్ మీర్కు పాకిస్థాన్ కోర్టు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది! 26/11 ముంబై దాడిలో అతడు కీలక పాత్ర పోషించాడు.
26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మజీద్ మీర్కు.. పాకిస్థాన్లోని ఓ కోర్టు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదానికి నిధులు చేరవేస్తున్నాడన్న ఆరోపణలు రుజువు అవ్వడంతో లాహోర్లోని యాంటీ టెర్రరిజం కోర్టు ఈ మేరకు చర్యలు చేపట్టింది. జైలు శిక్షతో పాటు రూ. 4లక్షల జరిమానా సైతం విధించింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ తీర్పును ఈ నెల తొలినాళ్లల్లోనే వెలువరించినట్టు తెలుస్తోంది. కాగా.. కేసుకు సంబంధించిన ఓ న్యాయవాది.. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. సాజిద్ను ఈ ఏడాది ఏప్రిల్లో పోలీసులు అరెస్ట్ చేశారని.. అప్పటి నుంచి అతను కాట్ లక్పత్ జైలులోనే ఉంటున్నాడని వెల్లడించారు.
కాగా.. సాజిద్ మీర్.. మరణించాడని కొన్నేళ్ల క్రితం వార్తలు వెలువడ్డాయి.
ఇండియాలో 'మోస్ట్ వాంటెడ్' లిస్ట్లో సాజిద్ మీర్ పేరు ఉంది. అతడి తలపై 5మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. 166మంది మరణించిన 26/11 ముంబై దాడుల్లో అతడి పాత్ర కీలకం. ఆ దాడుల్లో అతడిని 'ప్రాజెక్ట్ మేనేజర్' అని పిలిచేవారు. 2005లో అక్రమ పాస్పోర్టు ద్వారా ఇండియాలోకి ప్రవేశించాడు సాజిద్ మీర్.
ప్రస్తుతం ఎఫ్ఏటీఎఫ్(ఫైనాన్షియల్ టాస్క2 ఫోర్స్) జాబితాలో పాకిస్థాన్ 'గ్రే' లిస్ట్లో కొనసాగుతోంది. చివరిగా జరిగిన సమావేశంలో.. సాజిద్ను పట్టుకున్నట్టు ఎఫ్ఏటీఎఫ్కు పాకిస్థాన్ వెల్లడించినట్టు తెలుస్తోంది.
26/11 దాడులకు సంబంధించిన మరో సూత్రధారి, జమాత్ ఉద్ దావా చీఫ్ హఫీజ్ సాయిద్కు.. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఇప్పటికే 68ఏళ్ల జైలు శిక్ష పడింది.
ముంబై దాడులను అమలు చేసిన కమాండర్ జాకిర్ రెహ్మాన్ లఖ్వి.. ఇప్పటికే జైలులో ఉన్నాడు.
ఎల్ఈటీ కార్యకలాపాలన్నీ జమాత్ ఉద్ దావా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే రెండు ఉగ్రసంస్థలు కలిసి ముంబైలో భీకర దాడులకు పాల్పడ్డాయి.
ఎఫ్ఏటీఎఫ్..
ఉగ్రవాదులకు పాకిస్థాన్ అడ్డాగా మారిందని అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ను 2018లో గ్రే లిస్ట్లో పెట్టింది ఎఫ్ఏటీఎఫ్. గ్రే లిస్ట్లో ఉన్న దేశాలకు.. అప్పులు సులభంగా రావు. ఇతర విషయాలు కూడా కఠినంగానే ఉంటాయి. ఉగ్రవాదానికి చెక్ పెట్టాలని, ఇండియాపై దాడులు చేసేందుకు పాక్ను ఉపయోగించుకోకుండా చూసుకోవాలని ఆ దేశానికి ఎఫ్ఏటీఎఫ్ తేల్చిచెప్పింది.
సంబంధిత కథనం