India’s G20 presidency: భారత్ కు జీ20 అధ్యక్ష బాధ్యతలు
India’s G20 presidency: గ్రూప్ 20(G20) అధ్యక్ష బాధ్యతలను బుధవారం భారత్ స్వీకరించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో భారత ప్రధాని మోదీకి ఈ బాధ్యతలను లాంఛనంగా అందించారు.
India’s G20 presidency: ప్రతిష్టాత్మక జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. జీ 20 సదస్సు ముగింపు సందర్భంగా బుధవారం ఇండోనేషియా అధ్యక్షుడు జోకో ఈ బాధ్యతలను భారత ప్రధాని మోదీకి అందించారు. 2022 సంవత్సర జీ 20 అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా నిర్వహించిన విషయం తెలిసిందే.
ట్రెండింగ్ వార్తలు
India’s G20 presidency: డిసెంబర్ 1 నుంచి..
ప్రపంచదేశాల్లో అత్యంత ప్రభావశీల అంతర్జాతీయ బృందం జీ 20. ఈ G20 అధ్యక్ష బాధ్యతలను భారత్ ఈ డిసెంబర్ 1 నుంచి చేపట్టనుంది. ఈ అధ్యక్షత సంవత్సరం పాటు కొనసాగుతుంది. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లో జీ 20 సదస్సు భారత రాజధాని ఢిల్లీలో జరుగుతుంది.
India’s G20 presidency: క్రియాశీల కార్యాచరణతో..
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, క్రియాశీల కార్యాచరణతో ఈ అధ్యక్ష బాథ్యతలను భారత్ సమర్ధవంతంగా నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు. ప్రపంచంలో సానుకూల మార్పులకు భారత్ ఉత్ప్రేరకంగా వ్యవహరిస్తుందన్నారు. అన్ని దేశాలకు ఆహార, ఇంధన భద్రత కల్పించే దిశగా కృషి చేస్తుందన్నారు. ‘‘ప్రపంచమంతా ఇప్పుడు G20 వైపు ఆశావహ దృక్పథంతో చూస్తోంది. నిర్ణయాతమకంగా, అత్యంత క్రియాశీలంగా, లక్ష్యశుద్ధితో, అన్ని దేశాలను కలుపుకునిపోతూ జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను’’ అని మోదీ హిందీలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.
India’s G20 presidency: సవాళ్ల మధ్య కీలక బాధ్యతలు
‘ఆహార సంక్షోభం, ప్రాంతీయ విబేధాలు, దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, ఆహార, ఇంధన ధరల్లో అనూహ్య పెరుగుదల, కోవిడ్ విపరిణాలు.. తదితర సవాళ్ల మధ్య G20 అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరిస్తోంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇలాంటి కష్ట సమయంలోనే జీ 20 అధ్యక్ష బాధ్యతలను సమర్ధంగా నిర్వహించిందని ఇండోనేషియాను ప్రధాని మోదీ ప్రశంసించారు. శాంతి, భద్రతలు లేని సమాజంలో ఆర్థిక వృద్ధి ఫలాలను భవిష్యత్ తరాలకు అందించలేమన్నారు. ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత’’ థీమ్ తో భారత్ ఈ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తుందన్నారు.
India’s G20 presidency: మహిళల నాయకత్వంలో..
మహిళలన నాయకత్వంలో అభివృద్ధి అనేది జీ 20 ఎజెండాలో ప్రధానాంశమని మోదీ స్పష్టం చేశారు. భారత్ లో శతాబ్దాల చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్న ఇండోనేషియాలోని బాలిలో భారత్ ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలను స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.