Heatwave in India : హీట్వేవ్ ప్రభావం తగ్గుముఖం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!
Heatwave in India : దేశంలోని పలు ప్రాంతాల్లో హీట్వేవ్ తగ్గుముఖం పట్టనుంది. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ వివరాలు..
Heatwave in India 2023 : బిహార్, పశ్చిమ్ బెంగాల్, ఒడిశాలను గత 10 రోజుల పాటు ఉక్కిరిబిక్కిరి చేసిన హీట్వేవ్ పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ వివరాలను భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది.
పశ్చిమ్ బెంగాల్లోని గంగా నది తీర ప్రాంతాల్లో 10 రోజుల పాటు, బిహార్- ఒడిశాల్లో 5-7 రోజుల పాటు భానుడి ప్రతాపం కారణంగా ప్రజలు విలవిలలాడిపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను కూడా తాకాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మధ్యాహ్నం ప్రజలు బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇప్పుడు రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీలు తగ్గుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే.. పశ్చిమ, వాయువ్య భారతంలో మాత్రం 2-3 రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.
India Heatwave 2023 : మరోవైపు.. వెస్టర్న్ డిస్టర్బెన్స్తో పాటు కారణంగా యూపీపై నెలకొన్న సైక్లోన్ సర్క్యులెన్స్ కారణంగా అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
ఇదీ చదవండి :- IMD heatwave alert : అమ్మో ఎండలు.. హీట్వేవ్ ఎఫెక్ట్తో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఏపీకి చల్లటి కబురు..
Rains in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ఎండలు విపరీతంగా ఉన్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోత, వేడితో జనం అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో ఏకంగా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మండే ఎండల్లో ఏపీకి వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జూన్ వరకు హీట్వేవ్ ప్రభావం..!
ఈ ఏడాది హీట్వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొన్ని రోజుల క్రితం ఐఎండీ వెల్లడించింది. ఏప్రిల్- జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. మధ్య, తూర్పు, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో హీట్వేవ్.. సాధారణం కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని తెలిపింది. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, అవరసమైతే తప్ప మధ్యాహ్నం వేళ్లల్లో బయటకు వెళ్లకూడదని సూచిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తోంది.
సంబంధిత కథనం