Cyrus Mistry : టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం
Cyrus Mistry dies in road accident : టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
Cyrus Mistry dies in road accident : మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పాల్గఢ్ జిల్లాలో.. ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు ఓ డివైడర్ను ఢీకొట్టింది.
అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న సమయంలో సైరస్ మిస్త్రీకి చెందిన మెర్సిడీస్ కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.
"మధ్యాహ్నం 3:15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సుర్య నది బ్రిడ్జ్ మీద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇది యాక్సిడెంట్గా భావిస్తున్నాము," అని పాల్గఢ్ జిల్లా ఎస్పీ బాలాసాహెబ్ పటేల్.. మీడియాకు వెళ్లడించారు.
రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో సైరస్ మిస్త్రీ వాహనంలో మరో ముగ్గురు ఉన్నారు. సైరస్ మిస్త్రీతో పాటు మరొకరు మరణించారు. మిగిలిన ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.
సైరస్ మిస్త్రీ మృతదేహాన్ని.. పోస్టుమార్టం కోసం కాసా రూరల్ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
"సైరస్ మిస్త్రీ అకాల మరణ వార్త విని బాధ కలిగింది. జీవితంలో ఏదైన సాధించాలని ఆయనకు ఉండేది. ఇంత చిన్న వయస్సులో ఆయన మరణించడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. సైరస్ మిస్త్రీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి," అని.. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
టాటా గ్రూప్లో సైరస్ మిస్త్రీ ప్రస్తానం..
Cyrus Mistry Tata Sons : దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా రిటైర్మంట్ తర్వాత.. 2012లో టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతలను చేపట్టారు సైరస్ మిస్త్రీ. కాగా.. 2016లో ఆ బాధ్యతల నుంచి సైరస్ మిస్త్రీని తప్పిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై కొన్నేళ్ల పాటు సుప్రీంకోర్టులో విచారణ నడిచింది.
సైరస్ మిస్త్రీ తర్వాత.. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఎన్. చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించారు.
మరోవైపు సైరస్ మిస్త్రీ మరణంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"నా సోదరుడు సైరస్ మిస్త్రీ మరణ వార్తను నేను నమ్మలేకపోతున్నాను. రెస్ట్ ఈన్ పీస్ సైరస్," అని ఎన్సీపీ నేత సుప్రియా సూలే ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
"రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ మరణించారన్న వార్త బాధాకరం. ఆయన నాకు మంచి మిత్రుడు, జెంటిల్మాన్. షాపూర్ పలోంజీ వ్యాపారాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. టాటా గ్రూప్ను నడిపించారు," అని ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం