Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్.. రాహుల్ గాంధీతో కలిసి..: వీడియో
Ex RBI Governor Raghuram Rajan at Bahat Jodo Yatra: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.. భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో ముచ్చటిస్తూ నడిచారు. పూర్తి వివరాలు..
Ex RBI Governor Raghuram Rajan at Bahat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. రాజస్థాన్లో ఈ యాత్ర సాగుతుండగా.. నేడు (డిసెంబర్ 14) రాహుల్ గాంధీతో కలిసి నడిచారు రాజన్. ఆయనతో ముచ్చటించారు. సచిన్ పైలట్ కూడా ఉన్నారు. నోట్ల రద్దు విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాజన్ గతంలో కొన్నిసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వృద్ధి, ఆర్థిక లోటు విషయాలపై ఆందోళనతో కూడిన అభిప్రాయాలను గతంలో వెల్లడించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో రఘురామ్ రాజన్ కనిపించడం ఆసక్తికరంగా మారింది.
రాజస్థాన్లోని స్వామి మధోపూర్ పరిధిలోని భదోటి నుంచి భారత్ జోడో యాత్ర బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కలిశారు రఘురామ్ రాజన్. ఆయనతో ముచ్చటిస్తూ కాసేపు నడిచారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్లో యాత్ర జరిగింది. ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. అలాగే ఇప్పటి వరకు చాలా మంది వివిధ పార్టీల రాజకీయ నేతలు, కొందరు సినీ ప్రముఖులు, మాజీ అధికారులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో జమ్మూ కశ్మీర్లో ఈ భారత్ జోడో యాత్ర ముగియనుంది.
వందో రోజు కాన్సెర్ట్
డిసెంబర్ 15వ తేదీకి భారత్ జోడో యాత్ర 100 రోజులకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా జైపూర్లో భారత్ జోడో కాన్సెర్ట్ (Bharat Jodo Concert) ను కాంగ్రెస్ నిర్వహించనుంది. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతారు.