Chandigarh crime news : ఇన్స్టాగ్రామ్ స్నేహం.. భారీగా మోసపోయిన మహిళ!
Chandigarh crime news : మహిళకు అతను ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. విలువైన పార్సిల్ పంపిస్తున్నాను అని చెప్పి నమ్మించాడు. చివరికి ఆమె భారీగా మోసపోయింది. ఈ ఘటన ఛండీగఢ్లో జరిగింది. అసలేం జరిగిందంటే..
Chandigarh crime news : దేశంలో సైబర్ క్రైమ్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పరిచయం అవ్వడం, అవతలి వ్యక్తిని నమ్మించి, భారీగా దోచుకోవడం సైబర్ నేరస్థులకు అలవాటైపోయింది. ఎన్నిసార్లు చెప్పినా, అధికారులు ఎంత హెచ్చరించినా.. ప్రజలు అపరిచితులను నమ్మి, మోసపోతున్నారు. ఛండీగఢ్లో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ దాదాపు రూ. 3.5లక్షలు పొగొట్టుకుంది!
పూర్తిగా నమ్మేసి.. భారీగా మోసపోయి..
సంబంధిత మహిళ ఛండీగఢ్లోని ఓ ప్రాంతంలో నివాసముంటోంది. కాగా.. డేవ్ అనే వ్యక్తితో ఆమెకు కొంతకాలం క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. రెండు నెలల పాటు వీరిద్దరు ఛాటింగ్ చేశారు.
Cyber crime news : ఈ క్రమంలో మహిళకు డేవ్ ఓ విషయం చెప్పాడు. 'నేను విదేశాల్లో ఉంటాను. ఏప్రిల్ 18న ఇండియాకు వస్తున్నాను. నిన్ను కలుస్తాను. అయితే అంతకుముందే నీకు ఓ పార్సిల్ పంపిస్తాను. అది విలువైనది,' అని మహిళతో డేవ్ అన్నాడు. అందుకు ఆ మహిళ.. 'నువ్వు ఎలాగో ఇండియాకు వస్తున్నావు కదా. నువ్వే తీసుకుని రా,' అని బదులిచ్చింది. తాను సముద్ర మార్గంలో ఇండియాకు వస్తున్నట్టు, ఎక్కువ బరువు మోయడం కష్టమని చెప్పి మహిళను నమ్మించాడు డేవ్. ఆ మహిళ పార్సిల్ తీసుకునేందుకు అంగీకరించింది.
రోజులు గడిచాయి. గత నెల 14న మహిళకు ఓ ఫోన్ వచ్చింది. ఢిల్లీ కస్టమ్స్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఓ వ్యక్తి మాట్లాడాడు. పార్సిల్ కోసం రూ. 50వేలు చెల్లించాలని చెప్పాడు. మహిళ డేవ్కు కాల్ చేసింది. 'ఇండియా వచ్చాక నేను డబ్బులిస్తాను. నువ్వు ఇప్పుడు ఇచ్చేయ్,' అని జవాబిచ్చాడు. అది నమ్మిన మహిళ రూ. 50వేలు చెల్లించింది.
Woman duped huge money : ఇంకొన్ని రోజులు గడిచాయి. ఈ మహిళకు మళ్లీ కాల్ వచ్చింది. సంబంధిత పార్సిల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలు, విదేశీ కరెన్సీ నోట్లు ఉన్నాయని ఫోన్లో చెప్పారు. చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే రూ. 1.88లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ మహిళ డబ్బులు కట్టింది.
రెండు రోజుల తర్వాత ఆ మహిళకు మళ్లీ ఫోన్ వచ్చింది. స్టాంప్ డ్యూటీ కోసం రూ. 1లక్ష కట్టాలని డిమాండ్ చేశారు. ఆమె కట్టేసింది! ఇలా పేమెంట్స్ చేస్తున్నప్పటికీ.. ఆమెకు పార్సిల్ అందలేదు. మరోవైపు డేవ్ ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేశాడు.
Chandigarh latest news : చివరికి.. తాను మోసపోయినట్టు మహిళకు తెలిసి వచ్చింది. పోలీసులను ఆశ్రయించింది. 'ప్రైవేట్ బ్యాంక్లో లోన్ తీసుకుని డబ్బులు కట్టాల్సి వచ్చింది. నేను మోసపోయాను,' అని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
ఛండీగఢ్ పోలీసు విభాగానికి చెందిన సైబర్ సెల్ బృందం.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
సంబంధిత కథనం