Nupur statement on prophet : ఎంఐఎం చీఫ్ పేరూ ఎఫ్ఐఆర్లో చేర్చిన ఢిల్లీ పోలీస్
న్యూఢిల్లీ, జూన్ 9: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పేరును కూడా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు.
నిన్న ద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేసినందుకు బుక్ అయిన వారిలో స్వామి యతి నరసింహానంద కూడా ఉన్నారు.
ద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, సమూహాలను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు హానికరమైన వాతావరణాన్ని సృష్టించడం వంటి అనేక నిబంధనల కింద ఢిల్లీ పోలీసుల ఐఎఫ్ఎస్ఓ యూనిట్ బుధవారం నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్తో సహా పలువురిపై కేసు నమోదు చేసింది.
ఒక టీవీ చర్చలో వివాదాస్పద మతపరమైన వ్యాఖ్యలపై ఆరోపణలు చేసినందుకు బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ సస్పెన్షన్కు గురైన సంగతి తెలిసిందే.
‘పోలీసులు మతాలకు అతీతంగా అనేక మంది వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అశాంతిని సృష్టించే ఉద్దేశ్యంతో వివిధ సోషల్ మీడియా సంస్థలలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడంలో వారి పాత్రపై దర్యాప్తు చేస్తాం..’ అని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) అధికారి ఏఎన్ఐకి చెప్పారు.
ఎఫ్ఐఆర్లో నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్, షాదాబ్ చౌహాన్, సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా, పూజా శకున్ల పేర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
కాగా, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా తనను చంపుతామనే బెదిరింపులు వస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి (సస్పెండయ్యారు) నుపుర్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెకు భద్రత కల్పించినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం తెలిపారు.
‘ఆమె వ్యాఖ్యలపై బెదిరింపులు వస్తున్నాయని, వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించిన తర్వాత నుపుర్ శర్మ, ఆమె కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత కల్పించాం..’ అని ఒక అధికారి తెలిపారు.
మైనారిటీలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆదివారం సస్పెండ్ చేసింది.
బీజేపీ నాయకురాలి వ్యాఖ్యలపై గల్ఫ్ దేశాల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. కాగా మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు భారత్ ప్రకటించింది.
సంబంధిత కథనం
టాపిక్