Free LPG Cylinders : ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటికి 2 సిలిండర్లు ఉచితం!
Free LPG Cylinders in Gujarat : గుజరాత్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ని ఇచ్చింది. ఇక నుంచి ప్రతి ఇంటికి ఏడాదికి రెండు సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
Free LPG Cylinders : గుజరాత్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది! ప్రతీ ఇంటికి.. ఇక నుంచి ఏడాదికి రెండు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీతు వఘాని సోమవారం వెల్లడించారు. గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రకటన వెలువడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఏడాదికి రెండు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో ప్రజలు, గృహిణులపై రూ. 1000కోట్ల భారం తగ్గుతుందని వఘాని తెలిపారు. 38లక్షల మంది గృహిణులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి నగదును వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపారు
Free LPG Cylinders in Gujarat : అంతేకాకుండా.. సీఎన్జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్), పీఎన్జీ(పైపుడ్ నేచురల్ గ్యాస్)పై 10శాతం వాట్ను తగ్గించేందుకు గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించిందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు.
సీఎన్జీపై 10శాతం తగ్గిస్తే.. కేజీకి రూ.6-7 లబ్ధిపొందుతారని వఘాని పేర్కొన్నారు. అదే విధంగా.. పీఎన్జీపైనా కిలోకు రూ. 5-5.50 లబ్ధిపొందవచ్చని స్పష్టం చేశారు.
గుజరాత్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసి రాష్ట్ర ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చిందని విద్యాశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు.
ఎన్నికల షెడ్యూల్..
Gujarat Elections 2022 : గుజరాత్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ను కొన్ని రోజుల క్రితమే విడుదల చేసింది ఈసీ. వాస్తవానికి అప్పుడే గుజరాత్ పోలింగ్ షెడ్యూల్ కూడా వస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు. అందరు షాక్ అయ్యారు.
కాగా.. గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఈసీ షెడ్యూల్ను ప్రకటించలేదని, బీజేపీకి ఎన్నికల సంఘం మద్దతుగా నిలుస్తోందని కాంగ్రెస్తో పాటు ఇతర విపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ ఆరోపణలను కమలదళం తిప్పుకొట్టింది. ఆరోపణల్లో నిజం లేదని తేల్చిచెప్పింది.
Gujarat polls : ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు ‘ఉచితాల’ను ప్రకటిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇందులో ముందు వరుసలో ఉంది. ఉచిత విద్యుత్ వంటి హామీలు ఇస్తోంది. కాంగ్రెస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తోంది.
గుజరాత్ను బీజేపీ 27ఏళ్లుగా పాలిస్తోంది. సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి.. మరో దఫా కూడా అధికారం చేపట్టాలని పక్కా ప్రణాళిక రచించింది కమలదళం.
సంబంధిత కథనం